ఎం.కె.సరోజ | |
---|---|
జననం | మద్రాస్ కదిరవేలు సరోజ 1931 ఏప్రిల్ 7 |
వృత్తి | నాట్య కళాకారిణి |
జీవిత భాగస్వామి | మోహన్ ఖోకర్ |
పిల్లలు | హరిహరన్ నందన్ ఆశిష్ వివేక్ |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం సంగీత నాటక అకాడమీ అవార్డు కళైమామణి |
మద్రాస్ కదిరవేలు సరోజ ఒక భరతనాట్య కళాకారిణి, గురువు.
ఈమె 1931, ఏప్రిల్ 7వ తేదీన చెన్నైలో జన్మించింది. ఈమె తన 5వ యేట తన సోదరితో కలిసి ముత్తుకుమారన్ పిళ్ళై వద్ద శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం ప్రారంభించింది.[1]తన గురువు బెంగళూరుకు వెళ్ళడంతో ఈమె అక్కడికి వెళ్ళి నాట్యాన్ని అభ్యసించింది.[2]
ఈమె 1940లో తన తొలి నాట్యప్రదర్శనను ఇచ్చింది. తక్కువ సమయంలోనే మంచి నర్తకిగా పేరు గడించింది. 1946లో జెమినీ స్టూడియో సినిమాలలో నటించడానికి అవకాశాన్ని ఇచ్చింది. ఐతే ఈమె దానిని తిరస్కరించింది. 1949లో ఈమె చరిత్రకారుడు, నాట్యకళాకారుడు మోహన్ ఖోకర్ను వివాహం చేసుకుంది.[1][3][4]ఈమె తన భర్త మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా, నాట్య విభాగానికి అధిపతిగా నియమించబడటంతో అతనితో బాటు బరోడా వెళ్ళింది.[2] అక్కడ ఆమె సుందర్లాల్ గంగానీ, కుందన్ లాల్ గంగానీల వద్ద కథక్ నృత్యం నేర్చుకుంది.
1961లో మోహన్ ఖోకర్ కేంద్ర సంగీత నాటక అకాడమీకి స్పెషల్ ఆఫీసర్గా నియమించబడటంతో ఈమె న్యూఢిల్లీకి తన మకాం మార్చింది. అక్కడ ఈమె నాట్య గురువుగా తన ప్రస్థానాన్ని ప్రారంభింబింది. ఈమె రాష్ట్రపతి భవన్లో సౌదీ అరేబియా రాజు సమక్షంలో తన నృత్యాన్ని ప్రదర్శించింది. 1970 నుండి ఈమె 1970 నుండి 2000 వరకు ప్రతియేట ప్యారిస్లోని "సెంటర్ మండప" దర్శించి అక్కడి విద్యార్థులకు భరతనాట్యం నేర్పించిందై.[2]
ఈమె 40 యేళ్ళ సుదీర్ఘమైన నాట్యవృత్తిని తన భర్త మరణానంతరం 2000లో విరమించింది.[2] ఈమెకు నలుగురు కుమారులున్నారు. మూడవ కొడుకు ఆశిష్ మోహన్ ఖోకర్ చరిత్ర కారుడిగా, కళావిమర్శకుడిగా, రచయితగా రాణించాడు.[5] ప్రస్తుతం ఈమె చెన్నైలో నివసిస్తున్నది.[2]
ఈమె జీవితంపై యూనివర్సిటీ ఆఫ్ రోమ్, నాటక విభాగం ఒక డాక్యుమెంటరీని నిర్మించింది.[2]
ఈమె వద్ద భరతనాట్యం నేర్చుకున్న వారిలో నర్గిస్ కట్పిటియా, ప్రతిభా పండిట్, సుధా పటేల్, లక్ష్మి వల్రాణి, ఇంద్రాణి రెహమాన్, యామినీ కృష్ణమూర్తి, రొమానా ఆగ్నెల్, [6] శోభన రాధాకృష్ణ, రసికా ఖన్నా, అరుప్ ఘోష్, లూసియా మలోని, మిలెన సల్విని, విద్య మొదలైన వారున్నారు.