सेवा भारती | |
స్థాపన | 1989 |
---|---|
వ్యవస్థాపకులు | బాలాసాహెబ్ దేవరస్ |
రకం | విద్య, వైద్యం, విపత్తులు వంటి మొదలైన వాటిల్లో సేవా కార్యక్రమాలు |
కార్యస్థానం |
|
అనుబంధ సంస్థలు | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ |
సేవా భారతి అనేది ఒక ప్రభుత్వేతర సంస్థ (ఎన్జిఓ). దీని మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది భారతీయ సమాజంలో ఆర్థిక పరంగా బలహీనంగా ఉన్న ప్రజల కోసం పనిచేస్తోంది. ఉచిత వైద్య సహాయం, ఉచిత విద్య, వృత్తి శిక్షణ వంటి సామాజిక సంక్షేమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.[1][2]
ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ బాలాసాహెబ్ దేవరస్ 1979 ఏప్రిల్ 8 న ఢిల్లీ లోని అంబేద్కర్ స్టేడియంలో ఇచ్చిన ప్రసంగంలో భారతదేశంలోని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచాలని వాలంటీర్లను కోరారు. ఈ ప్రసంగం సేవా భారతిని ప్రారంభించడానికి దారితీసిన మొదటి అడుగుగా పరిగణిస్తారు. ఆర్ఎస్ఎస్, ఇతర అనుబంధ సంస్థల వాలంటీర్లు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను ప్రారంభం చేయడంలో ఈ ప్రసంగం సహాయపడింది.[3]
శ్రీ యాదవరావు జోషి (1989-1991)
శ్రీ కె. సూర్యననారాయణరావు (1991-1999)
శ్రీ భయ్యాజీ జోషి (1999-2004)
శ్రీ ప్రేమ్చంద్ గోయెల్ (2003–2007)
శ్రీ సీతారాం కేడిలయ (2007–2012)
శ్రీ సుహస్రావ్ హిరేమత్ (2012–2015)
శ్రీ అజిత్ మహాపాత్ర (2015-2017)
శ్రీ పరాగ్ అభ్యాసంకర్ (2017-)
గుజరాత్ భూకంపం, బీహార్ వరద, హిందూ మహాసముద్రం సునామీ, కేరళ వరదలు వంటి విపత్తులకు సేవా భారతి చేపట్టిన భారీ సహాయక చర్యలు వివిధ వర్గాల నుండి గణనీయమైన ప్రశంసలు పొందాయి. ఉగ్రవాద దాడుల కారణంగా అనాథలైన పిల్లలకు పునరావాసం కల్పించే దిశగా ఈ సంస్థ ప్రయత్నం చేసింది. సేవా భారతి స్వచ్ఛంద సేవకులు నేడు దేశంలోని మారుమూల ప్రాంతాల్లో లక్షకు పైగా సేవా ప్రాజెక్టులలో పాల్గొంటున్నారు. వరదలు, ప్రమాదాలు, భూకంపం, సునామీ వంటి ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ స్వచ్ఛంద సేవకులు ముందుంటారు. విద్యలో 13,786, ఆరోగ్య సంరక్షణలో 10,908, సాంఘిక సంక్షేమంలో 17,560 ప్రాజెక్టులు, 7,452 స్వావలంబన ప్రాజెక్టులూ సేవా భారతి చేపట్టినట్లు సమాచారం.[4] ఈ ప్రాజెక్టులు సమాజంలో ఆర్థిక బలహీనంగా, సామాజిక నిర్లక్ష్యం చేయబడిన వర్గాలకు వైద్య సహాయం, లైబ్రరీ, హాస్టల్, ప్రాథమిక విద్య, వయోజన విద్య, వృత్తి, పారిశ్రామిక శిక్షణ, వీధి పిల్లలు, కుష్ఠురోగుల అభ్యున్నతికీ తోడ్పడతాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా సేవా భారతి సమాజంలోని నిరుపేద వర్గాలను వారి జీవితంలోని అన్ని కోణాల్లో స్వావలంబనగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.[5]
సేవా భారతిలో దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు, ముఖ్యంగా గిరిజన, గ్రామీణ పేదలకు అనేక హాస్టళ్లు ఉన్నాయి. భారతదేశంలో బాల బాలికలకు హాస్టళ్లు, గ్రామీణ ప్రాంతాలు, మురికివాడలలో ప్రాథమిక విద్యా కేంద్రాలు, వీధి పిల్లలకు వయోజన, విద్యా కేంద్రాలు, దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఒకే ఉపాధ్యాయ పాఠశాలలు వంటివి భారతదేశంలో పదివేల విద్యా ప్రాజెక్టులను సంస్థ చేపట్టింది. మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థులు దేశంలోని వివిధ ప్రాంతాలలోని పాఠశాలల్లో చేరేందుకు ఇది సహాయపడుతుంది. పిల్లలకు జానపద పాటలు, నృత్యాలను నేర్పించే శిబిరాలను నిర్వహిస్తుంది. వారిలో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి కళలు, చేతిపనుల తయారీ, చిత్రలేఖనం వంటి వాటిలో శిక్షణ ఇప్పించే కార్యక్రమాలు చేస్తుంది. ఈ సంస్థ పెద్దలు, పిల్లలకు అనేక అక్షరాస్యత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఢిల్లీలోని మురికివాడల్లోని ఒక ప్రాజెక్టు వంద శాతం అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.[6][7]
అనాథ పిల్లల్ని పెంచి పోషించి వారికి విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలను అందించడంలో ఈ అనాథాశ్రమాలు పనిచేస్తున్నాయి.[8]
సేవా భారతిలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు వృత్తి శిక్షణ ఇచ్చే కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇది హస్తకళలు, అలంకరణ వస్తువులను తయారు చేయడంలో మహిళలకు శిక్షణ ఇస్తుంది. ఈ ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి సహాయపడుతుంది. సేవా భారతిలో శిక్షణ పొందిన వందలాది మంది బాలికలు, హస్తకళలను విజయవంతమైన కుటీర పరిశ్రమగా మారుస్తున్నారు.[9]
2001 లో వచ్చిన గుజరాత్ భూకంప బాధితులను రక్షించడానికి, పునరావాసం కల్పించడానికి సేవా భారతికి చెందిన 600 మంది వైద్యులతో సహా 25 వేల మంది వాలంటీర్లు పనిచేశారు. దాదాపు 10,000 ఆపరేషన్లు జరిగాయి. 19,000 మంది రోగులు చికిత్స పొందారు. అంతేకాకుండా, భూకంప బాధితుల కోసం సంస్థ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ మొత్తంలో సహాయక సామగ్రిని పంపింది.[10]
2004 లో వచ్చిన హిందూ మహాసముద్ర సునామీ సమయంలో సేవా భారతి ఇతర అనుబంధ సంస్థలతో కలిసి బాధిత ప్రాంతాలపై ఒక సర్వే నిర్వహించి, అత్యంత నష్టపోయిన గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి, ఇళ్ళు, ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించడంలో సహాయపడింది. బాధితుల కోసం కౌన్సెలింగ్ సెషన్లను కూడా నిర్వహించింది.[11]
దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో సంభవించిన వరదల్లో మొదటి దశ సహాయక చర్యలలో, వారు పొరుగు గ్రామాలు, జిల్లాల నుండి సేకరించిన 100 వేలకు పైగా ఆహార ప్యాకెట్లను అంతర్గత గ్రామీణ ప్రాంతాలైన కర్నూలు, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో పంపిణీ చేశారు. కర్నూలు పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్, జి పుల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆదోనీకి చెందిన వాలంటీర్లు మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని శుభ్రం చేసి, గోషాల, ఆవుల మృతదేహాలను, ఇతర జంతువుల కళేబరాలను పోలీసులకు అప్పగించారు.[12]
ఉత్తరాఖండ్లో జూన్ 2013 లో వచ్చిన వరదల్లో సేవా భారతిలోని 5,000 మంది, ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు భారత సాయుధ దళాలతో కలిసి ప్రజలకు రక్షణ కల్పించారు.[13]
చెన్నైలో 2015లో సంభవించిన వరదల్లో సేవా భారతికి చెందిన సుమారు 5900 మంది వాలంటీర్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలలో పాల్గొన్నారు.[14]
2018 లో వచ్చిన కేరళ వరదల్లో బాధిత ప్రజలకు ఆహారం, వసతి, వైద్య సేవలను అందించే శ్రేయోభిలాషులు, స్వచ్ఛంద సేవకుల సహకారంతో సేవా భారతి నేరుగా వివిధ సహాయ శిబిరాలను నిర్వహించింది. రాష్ట్రంలో వరద బాధిత జిల్లాల్లో 350 సేవాభారతి యూనిట్లు, 5,000 మంది వాలంటీర్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. 3,50,000 ఆహార ప్యాకెట్లను నిరుపేదలకు పంపిణీ చేశారు. ఒక వారంలోనే 10 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసారు. వరద సమయంలో రాష్ట్రంలో అత్యధిక వరద ప్రభావిత ప్రాంతాలలో ఒకటైన అళప్పుళా జిల్లాలోని కుట్టలనాడు ప్రాంతాలలో 20 వైద్య శిబిరాలు నిర్వహించబడ్డాయి. సేవాభారతికి చెందిన 40 అంబులెన్సులు వివిధ ప్రాంతాల్లో వరద సహాయ పనుల్లో నిమగ్నమయ్యాయి.[15][16]
భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు తాగునీటిని అందించే అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ఎక్కువగా నీటి కొరత ఎదుర్కొంటున్న వారికి ట్యాంకర్ల ద్వారా సబ్సిడీ రేటుతో లేదా ఉచితంగా నీరు సరఫరా చేయబడుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఆసుపత్రులలో ఉచిత ఆహార పంపిణీ కూడా జరుగుతుంది. శీతాకాలాలను ఎదుర్కోవటానికి చిన్న పిల్లలకు ఈ సంస్థ వెచ్చని దుస్తులు, స్వెటర్లను పంపిణీ చేస్తుంది. సేవా భారతి ఆధ్వర్యంలో జల భారతి జల సంరక్షణ అనే ఫోరం ప్రారంభించబడింది. జల భారతి నీటి సంరక్షణ, వర్షపునీటి పెంపకంపై సెమినార్, శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది
ఈ సంస్థ సాధారణ ప్రజలలో పర్యావరణ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇటువంటి అవగాహన ప్రచారాల వల్ల ప్రజలు అనేక పర్యావరణ అనుకూల చర్యలు తీసుకుంటున్నారు.[17]
సేవా భారతిలో వారి కుటుంబాలు, సమాజం నుండి నిరంతరం ఇబ్బంది ఎదుర్కొంటున్న సీనియర్ సిటిజన్లకు 'ఆసారే' అనే డేకేర్ సెంటర్ ఉంది.[18]
సేవా భారతి అనేది సహాయపడే వాలంటీర్లకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. అవసరమైన సేవలను అందించడంలో వాలంటీర్లు సహాయం చేస్తారు.[19]
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)