జమ్మీ కాశ్మీరులో కాల్పుల విరమణ రేఖను స్థాపించే ఒప్పందం | |
---|---|
రకం | కాల్పుల విరమణ రేఖ రచన |
సందర్భం | 1947 భారత పాకిస్తాన్ యుద్ధం తరువాత |
రాసిన తేదీ | 1948 ఆగస్టు 13 |
సంతకించిన తేదీ | 27 జూలై 1949 |
స్థలం | కరాచీ |
మధ్యవర్తులు | భారత పాకిస్తాన్ల కోసం ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన కమిషను |
చర్చల్లో పాల్గొన్నవారు | భారత పాకిస్తాన్ సైనికాధికారులు |
సంతకీయులు | లెఫ్టి.జ. ఎస్.ఎం.శ్రీనగేష్ భారత్ తరపున మేజ్.జ. డబ్ల్యు.జె.కాథోర్న్ పాకిస్తాన్ తరపున హెర్నాండో శాంపర్, ఎం.డెల్వోయీ UNCIP తరపున |
కక్షిదారులు | భారతదేశం పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి |
Depositaries |
|
భాషలు | English |
జమ్మీ కాశ్మీరులో కాల్పుల విరమణ రేఖను స్థాపించే ఒప్పందం | |
---|---|
రకం | కాల్పుల విరమణ రేఖ రచన |
సందర్భం | 1947 భారత పాకిస్తాన్ యుద్ధం తరువాత |
రాసిన తేదీ | 1948 ఆగస్టు 13 |
సంతకించిన తేదీ | 27 జూలై 1949 |
స్థలం | కరాచీ |
మధ్యవర్తులు | భారత పాకిస్తాన్ల కోసం ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన కమిషను |
చర్చల్లో పాల్గొన్నవారు | భారత పాకిస్తాన్ సైనికాధికారులు |
సంతకీయులు | లెఫ్టి.జ. ఎస్.ఎం.శ్రీనగేష్ భారత్ తరపున మేజ్.జ. డబ్ల్యు.జె.కాథోర్న్ పాకిస్తాన్ తరపున హెర్నాండో శాంపర్, ఎం.డెల్వోయీ UNCIP తరపున |
కక్షిదారులు | భారతదేశం పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి |
Depositaries |
|
భాషలు | English |
1949 లో కరాచీలో జరిగిన కరాచీ ఒప్పందంపై భారత పాకిస్తాన్ దేశాల సైనిక ప్రతినిధులు సంతకం చేసారు. 1947 భారత పాక్ యుద్ధం తరువాత, భారత పాకిస్తాన్ల కోసం ఏర్పటైన ఐక్యరాజ్యసమితి కమిషను పర్యవేక్షణలో జరిగిన ఈ ఒప్పందంలో, కాశ్మీరులో కాల్పుల విరమణ రేఖను ఏర్పాటు చేశారు. [1] అప్పటి నుండి ఈ కాల్పుల విరమణ రేఖను ఐక్యరాజ్యసమితి పరిశీలకులు పర్యవేక్షిస్తున్నారు. [2]
1948 ఏప్రిల్ లో ఐరాస భద్రతా మండలి చేసిన తీర్మానం 39, కాశ్మీర్లో పోరాటాన్ని నిలిపివేయడానికి, ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేయడానికీ, భారత పాకిస్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం చేయడం కోసమూ ఐరాస ఒక కమిషన్ (UNCIP) ను ఏర్పాటు చేసింది. ఇరువర్గాలతో చర్చలు జరిపిన తరువాత ఈ కమిషను, 1948 ఆగస్టులో మూడు భాగాలు కలిగిన తీర్మానాన్ని ఆమోదించింది. తరువాత దానికి ఒక 'అనుబంధాన్ని' కూడా జోడించింది. కాల్పుల విరమణ పద్ధతి, సంధి కోసం నిబంధనలు, ప్రజాభిప్రాయ సేకరణ కోసం చర్చల విధానాలను ఈ మూడు భాగాలు పరిష్కరించాయి. ఇరు దేశాలూ ఈ తీర్మానాన్ని అంగీకరించాయి. ఈ మేరకు 1948 డిసెంబరు 31 న కాల్పుల విరమణ జరిగింది.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కాల్పుల విరమణ రేఖను ఏర్పాటు చేయడానికి సంబంధించి భారత పాకిస్తాన్ సైనిక ప్రతినిధుల మధ్య కుదిరిన ఒప్పందం అని అధికారికంగా పిలిచే కరాచీ ఒప్పందంపై, 1949 జూలై 27 న సంతకాలు చేసారు.[3] దీనిని UNCIP కి చెందిన సంధి ఉప కమిటీ పర్యవేక్షిస్తుంది. [1]
సంతకం చేసినవారు:
భారత ప్రతినిధి బృందం లోని ఇతర సభ్యులు మేజర్ జనరల్ కె.ఎస్. తిమ్మయ్య, బ్రిగేడియర్ శామ్ మానెక్షా, మేజర్ ఎస్.కె. సిన్హా (జనరల్ శ్రీనగేశ్కు సహాయకుడిగా పనిచేశాడు), రక్షణ మంత్రిత్వ శాఖకు, కాశ్మీర్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకూ చెందిన కార్యదర్శులు. పాకిస్తాన్ ప్రతినిధి బృందంలో మేజర్ జనరల్ నజీర్ అహ్మద్, బ్రిగేడియర్ షేర్ఖాన్ లతో పాటు, పౌర అధికారులైన ఎమ్. అయూబ్, ఎ.ఎ. ఖాన్లు ఉన్నారు. తమ తమ అధీనంలో ఉన్న స్థానాలను గుర్తించడానికి ఇరుపక్షాల సైనిక ప్రతినిధులు జూలై 18 నుండి ఒక వారం పాటు చర్చలు జరిపారు. [4]
కరాచీ సమావేశానికి ముందు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారత ప్రతినిధి బృందంతో సమావేశమయ్యాడని ఎస్కే సిన్హా చెప్పాడు. కాశ్మీర్ భారతదేశంలో చేరడం లోని చట్టబద్ధతను ఐక్యరాజ్యసమితి తీర్మానం అంగీకరించిందనీ, అందువల్ల, "ఎవరికీ చెందని భూమి" ఎక్కడున్నా అది భారతదేశానికే చెందుతుందని ఆయన చెప్పాడనీ సిన్హా చెప్పాడు. పాకిస్తాన్ ప్రతినిధి బృందం తమ నియంత్రణలో ఉందని చెప్పే భూభాగాలన్నింటికీ దానికి సంబంధించిన ఋజువులను ఐరాస కమిషనుకు ఇవ్వాలి. ఈ సూత్రం ఆధారంగా, అనేక వందల చదరపు మైళ్ల భూభాగంలో భారతీయ దళాలు లేనప్పటికీ, ఈ ఒప్పందం ఆ భూభాగాలను భారతదేశం లోనే కలిపిందని సిన్హా పేర్కొన్నాడు. [5]
ఒప్పందం ద్వారా ఏర్పాటైన 830 కిలోమీటర్ల కాల్పుల విరమణ రేఖ జమ్మూలోని చీనాబ్ నదికి పశ్చిమాన మొదలౌతుంది. అక్కడ ఈ రేఖ యొక్క దక్షిణ కొస ఉంటుంది. అక్కడినుండి ఇది సుమారుగా చాపం లాగా ఉత్తర దిశగా వెళ్ళి, ఆ తరువాత ఈశాన్య దిశగా మ్యాప్ కోఆర్డినేటయిన NJ9842 వరకు వెళ్తుంది. ఈ బిందువు ష్యోక్ నదికి 19 కిలోమీటర్ల ఉత్తరాన ఉంది. [6]
మ్యాప్ పాయింట్ NJ9842 నుండి ఇది ఉత్తరంగా సుమారు 60-65 కి.మీ. దూరాన ఉన్న చైనా సరిహద్దు వరకు నడుస్తుందని అన్నారు. అయితే ఇది దుర్గమమైన హిమనదీయ భూభాగంలో సైనిక దళాలేమీ లేనందున, NJ9842 కు, చైనా సరిహద్దుకూ మధ్య కాల్పుల విరమణ రేఖను విస్తరించే ఎటువంటి ప్రయత్నమేమీ చెయ్యలేదు. ఈ సియాచిన్ హిమానీనద ప్రాంతం చివరికి భారత పాకిస్తాన్ల మధ్య వివాదానికి దారితీసింది. [7]
జమ్మూలో కాల్పుల విరమణ రేఖ యొక్క దక్షిణ కొసన మరొక ఇబ్బంది తలెత్తింది. కాల్పుల విరమణ రేఖ అంతమైన బిందువు నుండి భారత పంజబు, పాకిస్తాన్ పంజాబుల మధ్యనున్న అంతర్జాతీయ సరిహద్దు వరకూ 200 కి.మీ. కు పైగా అంతరం ఉంది. పాకిస్తాన్ పంజాబుకు, జమ్మూ కాశ్మీర్ సంస్థానానికీ మధ్య గుర్తించబడిన "ప్రాంతీయ సరిహద్దు" ఈ ప్రాంతం గుండా పోతుంది భారతదేశం ఈ సరిహద్దును "అంతర్జాతీయ సరిహద్దు" గా గుర్తిస్తుంది. పాకిస్తాన్ దీనిని "సరిహద్దు" లేదా "ఆచరణాత్మక సరిహద్దు" గా పేర్కొంటుంది. [7]
ఐరాస పత్రం సంఖ్య S / 1430 / Add.2 [8] (ఇది 1949 కరాచీ ఒప్పందానికి రెండవ అనుబంధం) జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పటంలో కాల్పుల విరమణ రేఖను (CFL) చూపిస్తుంది. ఈ అనుబంధపు శీర్షిక ఇలా ఉంటుంది:
కరాచీ ఒప్పందంలో అంగీకరించినట్లుగా కాల్పుల విరమణ రేఖను చూపించే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పటాన్ని జూలై 29, 30 తేదీలలో భారత, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆమోదించాయి. (భారత పాకిస్తాన్ల కొరకు ఏర్పాటైన ఐరాస కమిషను వారి మూడవ తాత్కాలిక నివేదిక యొక్క అనుబంధం 26 చూడండి)
కరాచీ ఒప్పందం సైనిక పరిశీలకుల పర్యవేక్షణలో ఉండేలా కాల్పుల విరమణ రేఖను ఏర్పాటు చేసింది. మిలిటరీ అడ్వైజర్ ఆధ్వర్యంలో ఉండే ఈ పరిశీలకులు, భారత పాకిస్తాన్ల లోని ఐక్యరాజ్యసమితి మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ (UNMOGIP) కు గుండెకాయ. 1951 మార్చి 30 న ఐక్యరాజ్యసమితి కమిషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్ (యుఎన్సిఐపి) ముగిసిన తరువాత, UNMOGIP చేత కాశ్మీర్లో కాల్పుల విరమణ రేఖను పర్యవేక్షించడం కొనసాగించాలని భద్రతా మండలి, తీర్మానం 91 (1951) ద్వారా నిర్ణయించింది. UNMOGIP యొక్క విధులు కాల్పుల విరమణ ఉల్లంఘనల ఫిర్యాదులను పరిశీలించడం, నివేదించడం, దాని ఫలితాలను ఇరుపక్షాలకూ సెక్రటరీ జనరల్కూ సమర్పించడం. [9]