37వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
![]() భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో | |
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | డిపెంబరు 3 2006 |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | "ది ఓల్డ్ బార్బర్" (లే వియక్స్ బార్బియర్) |
37వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2006 నవంబరు 23 నుండి డిసెంబరు 3 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది.[1][2][3] ఆస్ట్రేలియా దర్శకుడు రోల్ఫ్ డి హీర్ నేతృత్వంలోని జ్యూరీలో ఫ్రెంచ్ దర్శకుడు ఆలివర్ అస్సాస్, పోలిష్ నటి గ్రెయానా స్జాపోనోవ్ స్కా, అర్జెంటీనా నటి లెటిసియా బ్రెడిస్, భారతదేశానికి చెందిన జాహ్ను బారువా మొదలైనవారు ఉన్నారు.[4]
ఈ సంవత్సరంలో టెక్నికల్ రెట్రోస్పెక్టివ్ స్థాపించబడి, డిజిటల్ ఎడిటింగ్లోని అంశాలను 'కట్టింగ్ ఎడ్జ్'తోపాటు ఎడిటర్ స్టీవెన్ కోహెన్ చేత ప్రదర్శించబడింది. ఇటలీకి చెందిన సాంకేతిక నిపుణులు ఫిల్మ్ రిస్టోరేషన్, డిజిటల్ యానిమేషన్ గురించిన ప్రత్యేక ప్రదర్శనలు చేశారు.[4]
ఈ చిత్రోత్సవంలో నదిరా (నటి), నౌషాద్ (సంగీత దర్శకుడు), ఒడువిల్ ఉన్నికృష్ణన్ (మలయాళ నటుడు), భానుమతీ రామకృష్ణ (తెలుగు సినిమా నటీమణి, డాన్సర్, దర్శకురాలు, రచయిత్రి), పద్మిని (తెలుగు, తమిళ సినిమా నటి), హృషికేష్ ముఖర్జీ, రాజ్కుమార్ (కన్నడ నటుడు), శ్రీవిద్య (తమిళ/మలయాళ నటి), ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, పర్వీన్ బాబీ, మనోజ్ పంజ్ (యువ పంజాబీ చిత్ర దర్శకుడు, రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత) మొదలైన 11 మంది భారతీయ సినీ ముఖ్యులకు నివాళి అర్పించారు.[4]
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[5][6] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[7]