అడయార్ కె.లక్ష్మణ్ | |
---|---|
బాల్య నామం | అడయార్ కె.లక్ష్మణ్ |
జననం | కుప్పం, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా | 1933 డిసెంబరు 16
మరణం | 2014 ఆగస్టు 19 చెన్నై, తమిళనాడు, భారతదేశం | (వయసు 80)
జాతీయత | భారతీయుడు |
రంగం | భరత నాట్యం, భారతీయ శాస్త్రీయ సంగీతం |
శిక్షణ | కళాక్షేత్ర |
చేసిన పనులు | అలరింపు, పుష్పాంజలి |
అవార్డులు | పద్మశ్రీ పురస్కారం (1989) సంగీత నాటక అకాడమీ అవార్డు (1991) |
అడయార్ కె.లక్ష్మణ్ (1933 – 2014) [1] ఒక భరతనాట్య కళాకారుడు, నృత్య దర్శకుడు, గురువు.[2][3][4]
ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని కుప్పం పట్టణంలో 1933, డిసెంబరు 16వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి కృష్ణరాజారావు అక్కడ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. రుక్మిణీదేవి అరండేల్ సహాయకుడు పి.డి.దొరస్వామి అయ్యర్ ఇతడు, ఇతడి సోదరుడు రామారావుల అసమానమైన సంగీత ప్రతిభను గుర్తించి వారిని కళాక్షేత్రలో లలితకళల్లో శిక్షణ ఇప్పించడానికి ప్రతిపాదన చేశాడు. ఇతని తండ్రి ఈ ప్రతిపాదనకు సంతోషంగా అంగీకరించాడు.[5]
ఇతడు తన 11వ యేట 1944లో కళాక్షేత్రలో ప్రవేశించాడు. ఇతడు గాత్ర సంగీతం, భరతనాట్యం, నట్టువాంగం, మృదంగాలలో గొప్ప గురువుల వద్ద కఠిన శిక్షను తీసుకున్నాడు. ఇతడు రుక్మిణీదేవి అరండేల్, మైలాపూర్ గౌరి అమ్మ, కె.ఎన్.దండాయుధపాణి పిళ్ళై, ఎస్.శారద, టైగర్ వరదాచారి, బడలూర్ కృష్ణమూర్తిశాస్త్రి, టి.కె.రామస్వామి అయ్యంగార్, మైసూరు వాసుదేవాచార్య, తంజావూర్ రాజగోపాల అయ్యర్, వి.విఠల్, కమలారాణి, కారైక్కూడి ముత్తు అయ్యర్ వంటి మహామహుల శిష్యరికంలో భరతనాట్యం, కర్ణాటక సంగీతం, నట్టువాంగంలలో శిక్షణ పొంది 1954లో వాటిలో డిగ్రీ సంపాదించాడు. తరువాత కూడా కళాక్షేత్రలోనే కొనసాగుతూ భారత ప్రభుత్వం నుండి ఉపకారవేతనాన్ని పొంది 1956లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సంపాదించాడు.
తరువాత ఇతడు మృదంగంలో శిక్షణ పొందాడు. అంబు పణికర్, చందు పణికర్ల వద్ద కథాకళి నేర్చుకున్నాడు. ఈ సమయంలో రుక్మిణీదేవి అరండేల్ మేలత్తూర్ భాగవత మేళా సంప్రదాయంలో రూపొందించిన "కుమార సంభవం", "కుట్రల కురువంజి", "సీతా స్వయంవరం", "ఉషా పరిణయం" వంటి నృత్యనాటికలలో నటించాడు.[6]
ఇతడు మొదట వైజయంతిమాల నడిపిన "నృత్యాలయ"లో నాట్యాచార్యునిగా చేరాడు. అక్కడ 10 సంవత్సరాలకు పైగా పనిచేసి 10 మంది కళాకారులకు రంగప్రవేశం చేయించాడు. "తిరుప్పావై", "అళగర్ కురువంజి", "చండాలిక", "సంగ తమిళ్ మాలై" వంటి నృత్య నాటికల రూపకల్పనలో సహకరించాడు.
1969, ఆగష్టు 29వ తేదీన ఇతడు "భారత చూడామణి అకాడమీ"ని స్థాపించాడు. ఈ అకాడమీ ద్వారా ఇతడు అనేక మందికి శిక్షణనిచ్చి వారిని నాట్య కళాకారులుగా తీర్చిదిద్దాడు. "వరుణపురి కురవంజి", "అచ్చయ్యార్ కురవై" మొదలైన నృత్యనాటికలను రూపొందించాడు. హంసగీతె, సుబ్బశాస్త్రి, ఆనంద తాండవం వంటి సినిమాలలో శాస్త్రీయ నృత్యాలకు నృత్య దర్శకత్వం వహించాడు.[6][7]
ఇతడు భరతనాట్యంలో గురువుగా, కొరియోగ్రాఫర్గా, కంపోజర్గా, నట్టువనార్గా సలిపిన కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలను స్వంతం చేసుకున్నాడు. 1989లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం, 1991లో భరతనాట్యంలో సంగీత నాటక అకాడమీ అవార్డు[8] మొదలైనవి స్వీకరించాడు.
ఇతడు తన 80యేళ్ళ వయసులో చెన్నైలో 2014, ఆగష్టు 19వ తేదీన మరణించాడు.