ఎస్.పి.శైలజ | |
---|---|
జననం | |
వృత్తి | గాయని |
జీవిత భాగస్వామి | శుభలేఖ సుధాకర్ |
పిల్లలు | 1 అబ్బాయి - శ్రీకర్ |
తల్లిదండ్రులు |
|
వెబ్సైటు | @sailaja_sp (instagram) |
శ్రీపతి పండితారాధ్యుల శైలజ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక సినిమా గాయని, డబ్బింగ్ కళాకారిణి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలలో పది వేల పాటలు పాడింది. ఈమె గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, శుభలేఖ సుధాకర్ భార్య. ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు.
నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో సాంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించిన శైలజ తండ్రి సాంబమూర్తి హరికథా భాగవతారు. అన్న ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం దక్షిణ భారత సినిమా రంగంలో పేరొందిన నేపథ్యగాయకుడు. తండ్రి, అన్న కూడా ఈమెను బాగా చదివించాలని అనుకునేవారు.
1977లో బాలసుబ్రహ్మణ్యం ట్రూపు వారు విదేశాలలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వడానికి విమానాశ్రయానికి శైలజ కూడా వెళ్ళింది. అక్కడ విమానం ఆలస్యం కావడంతో కాలక్షేపానికి సినీ దర్శకుడు కె.చక్రవర్తి సమక్షంలో సరదాగా పాటలు పాడింది. ఆ తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా మద్రాసు పిలిపించి మార్పు (1978) సినిమా కోసం పాట పాడించారు.[1] ఈనాటి దర్శకుడు తేజ ఆ సినిమాలో చిన్న పిల్లవాడిగా నటించాడు. ఈమె పాడిన పాటలలో సాగర సంగమంలోని "వేదం అణువణున నాదం", మొండి మొగుడు పెంకి పెళ్ళాంలోని "లాలూ దర్వాజ కాడా లష్కర్" అన్న పాటలు కొన్ని చాలా పేరొందాయి.
ఈమె మద్రాసులో భరతనాట్యం నేర్చుకొని అరంగేట్రం ఇస్తున్నప్పుడు, దానికి వచ్చిన కె.విశ్వనాథ్ తాను తీస్తున్న సాగర సంగమంలో ఒక నాట్యం చేసే పాత్ర కోసం ఈమెను, కుటుంబసభ్యుల్ని ఒప్పించి మొదటిసారిగా నటింపజేశారు. అలా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని "వేదం అణువణువున నాదం" అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించింది.[2] ఇదే ఈమె నటించిన ఏకైన చిత్రం.
ఈమె సుమారు 70 సినిమాలలో చాలా మంది నటీమణులకు గాత్రదానం చేశారు. అందులో మొదటిది పట్నం వచ్చిన పతివ్రతలు. అందులో ఆమె రాధిక గారికి తన గొంతును వాడారు. ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. ఆ తర్వాత వసంత కోకిలలో శ్రీదేవి గారికి, నిన్నే పెళ్లాడుతా, మురారి చితాలల్లో టబుకి కూడా ఈమే డబ్బింగ్ చెప్పింది.
ఈమె శుభలేఖ సుధాకర్ను పెళ్ళి చేసుకున్నది. వీరికి ఒకే అబ్బాయి - శ్రీకర్.