ఏప్రిల్ 1 విడుదల (1991 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | వంశీ |
నిర్మాణం | గొట్టిముక్కల పద్మారావు |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, శోభన, కృష్ణ భగవాన్ జయలలిత (నటి) |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | పూర్ణతేజ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
ఏప్రిల్ 1 విడుదల సినిమా ఎమ్.ఐ.కిషన్ రాసిన "హరిశ్చంద్రుడు అబద్దమాడితే" అనే నవల ఆధారంగా నిర్మించబడింది.పూర్ణతేజ క్రియేషన్స్ బ్యానర్ లో గొట్టిముక్కల పద్మారావు నిర్మించిన ఈ చిత్రం కు దర్శకుడు వంశీ. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన జంటగా నటించగా, సంగీతాన్ని ఇళయరాజా అందించారు.
అబద్ధాలతోనూ, లౌక్యంతోనూ ఆనందంగా బ్రతికే దివాకరం (రాజేంద్రప్రసాద్) ఒక అనాథ. రైల్వేలో డాక్టరుగా పని చేసే వసుంధర అతడిని కొడుకులా పెంచుతుంది. విజయనగరంలో పెళ్ళికి వెళ్ళిన దివాకరం భువనేశ్వరి (శోభన) అనే ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. రైల్వేలో బుకింగ్ క్లర్కుగా పనిచేసే ఆమె కొన్ని విలువలతో జీవిస్తుంటుంది. ఆమె కోసం ఆమె బాబాయితో మాట్లాడి పెళ్ళికి ఒప్పించమని చెపుతాడు. ఆమెతో పెళ్ళి అయ్యేనాటికి అన్ని సౌకర్యాలు, ఇల్లు సమకూర్చాలని అబద్దలతో, తన తెలివితేటలతోనూ, ఆ ప్రాంతానికి రౌడీగా చలామణీ అయ్యే తన మిత్రుడు గోపి (కృష్ణ భగవాన్) సహాయంతోనూ డబ్బు సమకూర్చి వీడియో షాపు ప్రారంభిస్తాడు.
భువన బదిలీ మీద రాజమండ్రి వస్తుంది. తన ప్రేమను తెలియచేసి తను ఆమె కోసం ఏమేమి చేస్తున్నానో తెలియ చెపుతాడు దివాకరం. అప్పటికే అతనిపై మంచి అభిప్రాయం లేని ఆమె అతనికి కొన్ని షరతులతో కూడిన ఒక పేపరుపై సంతకం తీసుకొంటుంది. దాని ప్రకారం అతడు ఒక నెలపాటు అనగా ఏప్రిల్ 1 వరకూ అబద్దాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా, నిజాలు మాత్రమే చెపుతూ ఉండాలి. అలాగైతే అతడితో పెళ్ళికి సరే అంటుంది. సరే అని ఒప్పుకుంటాడు దివాకరం. అప్పటి నుండి అతడు కేవలం నిజాలు మాత్రమే చెపుతుండటం వలన చాలా మందికి కష్టాలు ప్రారంభమవుతుంటాయి. ఎన్నో రకాలుగా అతని వలన కాలనీ వాసులు ఇబ్బందులు పడుతారు. చివరకు అతడు చెప్పిన నిజాల వలన అతని మిత్రుడు గోపి జైలుకు వెళతాడు. దివాకరంపై పగ పట్టిన గోపి అతడిని చంపేందుకు వెతుకుతూ అతడిని చంపబోతే వసుంధర గోపిని గొడుగుతో పొడిచి చంపేస్తుంది. తమ పందెంలో గడువు ఆ రోజుతో ముగుస్తుందని తెలిసీ తనను తల్లిలా పెంచిన ఆమె కోసం అతడు అబద్ధం చెప్పి ఆ నేరాన్ని తనపై వేసుకొని జైలుకు వెళతాడు. కాని వసుంధర జరిగినది పోలీసులకు చెప్పి తను లొంగి పోతుంది. ఆపద సమయంలో చేసిన హత్య కనుక ఆమెకు ఎక్కువ శిక్ష పడదు. దివాకరం తను ఓడిపోయాను కనుక ఇక ఎప్పుడూ నీకు కనిపించనని భువనతో చెపుతాడు. అతడి నిజాయితీ అర్ధమయిన భువన అతడితో పెళ్ళికి ఒప్పుకుంటుంది.