కమండలం ఒక దీర్ఘవృత్తాకారంలో ఉండే నీటి పాత్ర. ఇది భారత ఉపఖండంలో ఉద్భవించింది. ఎండిన గుమ్మడికాయతో గాని, కొబ్బరి చిప్ప, లోహం, కమండలతరు చెట్టుతో గానీ, [1] బంకమట్టితో గానీ దీన్ని తయారు చేస్తారు. దీన్ని పట్టుకోడానికి ఒక కాడ (హ్యాండిల్) ఉంటుంది. కొన్నిసార్లు చిమ్ము కూడా ఉంటుంది. హిందూ సన్యాసులు, యోగులు తాగునీటిని నిల్వ చేసుకోడానికి దీన్ని ఉపయోగిస్తారు. [2] నీటితో నిండిన కమండలం సన్యాసుల చేతుల్లో తప్పక ఉంటుంది. నిరాడంబమైన, సరళమైన, స్వయం ప్రతిపత్తి గల జీవనానికి ఇది సూచిక. హిందూ మతంలో సన్యాసానికి చెందిన చిహ్నాల్లో కమండలాన్ని ఒకటిగా చూస్తారు. కమండలాన్ని జైన సన్యాసులు కూడా ఉపయోగించారు. కొంతమంది బోధిసత్వుల చిత్రణలలో కూడా ఇది కనిపిస్తుంది. [3]
కమండలాన్ని లోహం, బంకమట్టి, కలప, ఎండిన గుమ్మడికాయతో సహా వివిధ పదార్థాలతో తయారు చేయవచ్చు. గుమ్మడికాయ కమండలం తయారీకి, పండిన గుమ్మడికాయను తెంపి లోపలి గుజ్జునూ, విత్తనాలనూ తీసివేస్తారు. ఇక బయటి పెంకు మాత్రమే ఉంటుంది. దీనినే కమండలంగా ఉపయోగిస్తారు . ఇది ఒక వ్యక్తి లోని అహాన్ని తొలగించడంగా ఆధ్యాత్మిక వివరణ నిస్తారు. పండిన గుమ్మడికాయ వ్యక్తిని సూచిస్తుంది, విత్తనం అహం. విత్తనాన్ని తొలగించడం అహం తొలగింపును సూచిస్తుంది. ఈ విధంగా శుద్ధమైన వ్యక్తి స్వీయ సాక్షాత్కారం పొందేందుకు సిద్ధమౌతారు. [4]
కమండలం లోని నీరు అమృతానికి సూచిక. సంతానోత్పత్తి, జీవం, సంపద లకు చిహ్నం. [5] దేవతల చిత్రీకరణల్లో, వారి చేతుల్లో కమండలం ఉంటుంది. [5] ఆది శంకరాచార్యుల అష్టోత్తరం శ్లోకంలో కమండలంతో ఉన్న శివుడిని ప్రార్థిస్తాడు. అగ్ని దేవుడు, దేవతల గురువు బృహస్పతి వంటి ఇతర దేవతల చేతుల్లో కమండలం ఉంటుంది. [6] [7] దేవీ మాహాత్మ్యంలో బ్రాహ్మణి దేవి తన కమండలం లోని పవిత్ర జలాన్ని చల్లి రాక్షసులను చంపుతుంది. [8] సా.పూ. 183–165 నాటి నాణెంపై శ్రీ కృష్ణుడు కమండలం పట్టుకుని ఉన్నట్లు చూపిస్తుంది. [9]
అనేక పౌరాణిక గాథల్లో కమండలం కనిపిస్తుంది. వామనావతారంలో విష్ణువు రాక్షస రాజు బలి చక్రవర్తిని మూడు అడుగుల భూమి కోరుతాడు. కమండలం ద్వారా నీరు వదలుతూ దానం చేయడామనేది పద్ధతి. అలా చేసే సమయంలో దానవ గురువు శుక్రాచార్యుడు సూక్ష్మరూపంలో, కమండలానికి ఉన్న చిమ్ముకు అడ్డుపడి నీరు రాకుండా చేస్తాడు. వామనుడు ఒక దర్భతో ఆ చిమ్మును పొడవడాంతో శుక్రాచార్యునికి ఒక కన్ను పోతుంది. [10] భాగవతంలో, సత్యవర్త రాజు నదిలో దొరికిన చేపను పెద్ద చేపల నుండి రక్షించడానికి తన కమండలంలో ఉంచుతాడు. తరువాత ఆ చేపే పెరిగి మహా మత్స్యావతారమై మహా జల ప్రళయం నుండి రాజును రక్షిస్తుంది. [11] సాగర మథనంలో ఉద్భవించిన అమృతాన్ని ధన్వంతరి కమండలం లోనే తీసుకువస్తాడు. [12] రామాయణంలో హనుమంతుడు తనను తాను ఋషిగా మారువేషం వేసుకుని, తన కమండలంలో నిల్వ చేసిన తన మూత్రాన్ని రాక్షసుల చేత తాగిస్తాడు. [13]
పౌరాణిక సరస్వతి నది సృష్టికర్త బ్రహ్మ కమండలం నుండి ఉద్భవించింది. [14] గంగా నది కూడా బ్రహ్మ కమండలం గుండా ప్రవహిస్తుందని నమ్ముతారు. [15] బ్రహ్మ వామనుడి కాలి బొటనవేలును కడిగి, ఆ నీటిని తన కమండలం లోకి సాంగ్రహించాడు. ఇదే గంగా నదిగా ప్రవహిస్తోంది. [16]
మరొక నది సిలంబు కూడా ఇదే విధమైన ఉద్భవించిందని ప్రతీతి. బ్రహ్మ తన కమండలంలోని నీటితో వామనుని పాదాన్ని కడిగినప్పుడు, ఒక చుక్క వామనుడి పాదం నుండి భూమిపై పడి ఈ నదిగా మారింది. [17] పుణ్యక్షేత్రమైన దర్శ పుష్కరిణి గురించి మరొక పురాణ గాథ, అగస్త్య మహర్షి తనను పెళ్ళి చేసుకొమ్మని కావేరి నదిని కోరగా ఆమె తిరస్కరించింది. దాంతో అతను తన కమండలంలో కావేరి నదిని ఎలా బంధించాడో వివరిస్తుంది. దాంతో ఈ ప్రాంతంలో కరువు ఏర్పడింది. దీనిని గమనించి కావేరి, కమండలం నుండి తప్పించుకుంది. అప్పడు పొందిన ఋషి శాపం నుండి చివరకు దర్శ పుష్కరిణి వద్ద నివృత్తి పొందింది. [18] కావేరి నిర్బంధించండంపై కోపించిన వినాయకుడు, కాకి రూపంలో, అగస్త్యుని కమండలాన్ని కిందకు నెట్టి, కావేరిని కాపాడాడు. ఆ విధంగా నదిగా ప్రవహించింది అని మరో కథ చెబుతుంది.
శ్రాద్ధ క్రియల్లో కమండలాన్ని దానం చేయాలని గరుడ పురాణం చెబుతుంది. ఆ విధంగా మరణించిన వ్యక్తి తన మరణానంతర ప్రయాణంలో పుష్కలంగా తాగునీరు లభిస్తుంది. [19]