వరప్రసాదరెడ్డి | |
---|---|
జననం | కోడూరు ఈశ్వర వరప్రసాద రెడ్డి 1948 నవంబరు 17 |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం Böblingen విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం[1] |
వృత్తి | శాంతా బయోటెక్నిక్స్ చైర్మన్ |
వరప్రసాద రెడ్డి గా పేరు గాంచిన కోడూరు ఈశ్వర వర ప్రసాద రెడ్డి ఒక భారతీయ పారిశ్రామికవేత్త,, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్నిక్స్ యొక్క వ్యవస్థాపక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. హెపటైటిస్-బి టీకాను ధరను సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలోగా కృషి చేశాడు.[2] కేంద్ర ప్రభుత్వం ఆయనకు 2005లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
వరప్రసాద రెడ్డి రైతు కుటుంబంలో పుట్టాడు. వారిది ఉమ్మడి కుటుంబం. ఈయన మేనమామ పుచ్చలపల్లి సుందరయ్య శిష్యుడు, కమ్యూనిస్టు. చిన్నతనంలో ఆయన దగ్గరే పెరిగాడు కాబట్టి ఆయనకూ కమ్యూనిస్టు భావజాలం అబ్బింది.[3]
23 ఏళ్ళ వయసులో డి. ఆర్. డి. ఓలో ఉద్యోగంలో చేరి అక్కడే ఏడేళ్ళు పనిచేశాడు. అక్కడి పని తీరు నచ్చక రాజీనామా చేశాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ బోర్డులో చేరి అక్కడ ఐదేళ్ళు పనిచేశాడు. కానీ అక్కడ కూడా నచ్చక దానికి కూడా రాజీనామా ఇచ్చాడు.
1985 లో ప్రొఫెసర్ జగదీష్ ప్రసాద్ భాగస్వామ్యంతో క్షిపటి బ్యాటరీలకు సంబంధించిన సంస్థలో పెట్టుబడులు పెట్టాడు. కానీ ఆయనతో అభిప్రాయ భేదాలు రావడంతో ఆ సంస్థనుంచి బయటకు రావలసి వచ్చింది. తర్వాత ఆయన కజిన్ ఒకరు అమెరికాకు తీసుకెళ్ళడంతో అక్కడ వారు హెపటైటిస్ బి గురించి చర్చించడం విన్నాడు. వారు భారతదేశం గురించి తక్కువ చేసి మాట్లాడటం ఆయన్ను కలిచివేసింది. దానికి టీకాను తయారు చేయాలనే ఆలోచన మొదలైంది. దాని సాంకేతిక గురించి అమెరికన్ నిపుణులతో చర్చించబోతే అక్కడా ఆయనను చిన్నచూపు చూశారు. మరో భారతీయ శాస్త్రవేత్త సలహాతో స్వయంగా ఆ సాంకేతికతను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు.
అప్పటికి హైదరాబాదులో బయో టెక్నాలజీ కంపెనీలు లేవు. భారతదేశం కోసం సేవ చేయండని చెప్పి కొంతమందిని పిలిపించి తమ బృందంలో చేర్చుకున్నాడు. కొద్ది మంది మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. సంస్థను నిలబెట్టడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. ఈయనది ఇంజనీరింగ్ నేపథ్యం కావడంతో బయో టెక్నాలజీ కంపెనీకి ఋణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాలేదు. ఆయన నాన్న పొలాన్ని అమ్మి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాడు. కొంతమంది బంధువులు, స్నేహితుల సాయం కూడా అందింది. రెండు కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రయోగశాలలో పని చేయడం మొదలు పెట్టారు. తక్కువ ధరకే టీకాను అందించాలన్న ఆయన సంకల్పాన్ని నమ్మి మరికొంత మంది పెట్టుబడులు పెట్టారు. అలా సుమారు 15 కోట్ల రూపాయలు సమకూరాయి. 1991 లో ఈ ఆలోచనకు అంకురార్పణ జరగగా 1992 నుంచి పని మొదలై 1997 ఆగస్టుకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ తయారు చేశారు.
శాంతా బయోటెక్ సంస్థ ప్రారంభించిన తర్వాత 8 కంపెనీలు బయోటెక్ విభాగాన్ని ప్రారంభించాయి. అప్పటికే ఈ సంస్థకు మంచి పేరు వచ్చింది. కొన్ని కంపెనీలు సాంకేతికను వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాయి. శాంతా బయోటెక్ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల పరీక్ష ఎదుర్కొని రెండేళ్ళ పాటు పరిశీలన తర్వాత యూనిసెఫ్ దగ్గర నుంచి ఆర్డర్లు రావడం మొదలు పెట్టాయి.[4] అలా ఈ సంస్థ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు అందినా భారతదేశంలో పిల్లలకు మాత్రం ఆరోగ్య శాఖ సహకరించక పోవడంతో అందలేదు. కొన్నేళ్ళ తర్వాత అందుబాటులోకి వచ్చాయి.
వరప్రసాద్ రెడ్డి వ్యక్తిగతంగా సంగీత, సాహితీ ప్రియుడు. కొన్ని పుస్తకాలు కూడా రాశాడు.