జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న ఈ జిల్లా కొత్తగా అవతరించింది.[1]
ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 13 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ఇందులో 12 మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి కాగా, ఒక మండలం పూర్వపు నల్గొండ జిల్లాలోనిది. జిల్లాలో స్టేషన్ ఘన్పూర్ను కొత్తగా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటుచేశారు.[2]
భౌగోళికంగా ఈ జిల్లా రాష్ట్రం మధ్యలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాలు, తూర్పున వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ జిల్లాలు, దక్షిణాన సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు, నైరుతిన యాదాద్రి భువనగిరి జిల్లా, వాయువ్యాన, ఉత్తరాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
సికింద్రాబాదు నుంచి కాజీపేట వెళ్ళు రైలుమార్గం, హైదరాబాదు నుంచి వరంగల్ వెళ్ళు ప్రధానరహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది. సిద్దిపేట జిల్లా నుండి సూర్యాపేట జిల్లా వెళ్ళు ప్రధాన రహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది.
బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి జనగామ జిల్లా లోని బొమ్మెర గ్రామములో జన్మించారు.తెలంగాణ సాయుధపోరాటంలో అమరుడైన తొలి యోధుడు దొడ్డి కొమురయ్య, తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య ఈ జిల్లాకు చెందినవారు. నిరంకుశ నిజాం కు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో దాదాపు జిల్లాలోని ప్రతి గ్రామం లోని యువకులు రజాకార్ల కు వ్యతిరేకంగా పోరాడారు. 1948 కి ముందు ప్రస్తుత జిల్లాలోని చాలా భాగం నల్గొండ జిల్లా పరిధిలో ఉండేది.
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (2)