తెలుగు కథకుడు, కాళీపట్నం రామారావు సన్మాన కార్యక్రమంలో తెలుగు కథా రచయితలు
తెలుగు కథ, తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం కథ అనగా కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం. ఆంధ్రదేశంలో చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం బాగా అలవాటు. పాత కాలపు కథల్లో తూర్పుదేశాల కథలు ప్రసిద్ధిపొందాయి. తెలుగులోను, ఇతర భారతీయ భాషలలో కొత్త కథ పుట్టి సుమారు నూరేళ్ళయింది. ఈ నూరేళ్ళలో సుమారు లక్షకు పైగా కథలు రచించబడినట్లుగా ఒక అంచనా. ఇవి ఎక్కువగా దిన, వార, మాస పత్రికలలో ప్రచురిస్తారు. కొన్ని కథా సంకలనాలు ప్రత్యేకంగా ముద్రిస్తారు.ఈ కథలు ముఖ్యంగా సాహసం, ఔదార్యం, నీతి, ధర్మం, శృంగారం వంటి విషయాలు ప్రధాన వస్తువుగా నడుస్తాయి. ఇతర సాహిత్య ప్రక్రియలన్నింటికన్నా కథలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది.
కథ పర్యాయపదాలు చరిత్ర, గాథ, వృత్తాంతం. కథ ప్రకృతి అయితే కతవికృతి. కథలు చెప్పేవాడిని 'కథకుడు' అంటారు. కథలో ప్రధాన పురుషుడు 'కథానాయకుడు', ప్రధాన స్త్రీ 'కథానాయకురాలు'. కీర్తిశేషుడైన లేదా మరణించిన పురుషుడు 'కథాశేషుడు', మరణించిన స్త్రీ 'కథాశేషురాలు' అని సంభోదిస్తారు
కథ అనే ప్రక్రియ తెలుగులో తొలిసారిగా గురజాడ అప్పారావు రచించిన 'దిద్దుబాటు' కథను పేర్కొంటారు. బండారు అచ్చమాంబ, ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ వంటి వారు గురజాడకు ముందే తెలుగు కథకు శ్రీకారం చుట్టారు. అయినా కూడా ఆధునిక కథా రచనకు దగ్గరగా వున్న మొదటి కథగా 'దిద్దుబాటు'ను పరిగణిస్తున్నారు. ఈ కథకు మునుపే కథా నిర్వచనానికి అనుగుణంగా వున్న కొన్ని కథలతో కాళీపట్నం రామారావు ఒక కథా సంకలనాన్ని ప్రచురించాడు.