నా బంగారు తల్లి (2014 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | రాజేష్ టచ్రివర్ |
నిర్మాణం | సునీతా కృష్ణన్ ఎం.ఎస్.రాజెష్ |
కథ | సునీతా కృష్ణన్ |
చిత్రానువాదం | రాజేష్ టచ్రివర్ అనంతరామ్ (సంభాషణలు) గార్లపాటి వెంకట్ రఘు(పాటలు) |
తారాగణం | అంజలీ పాటిల్, సిద్దిక్ లక్ష్మీ మీనన్ |
సంగీతం | శరత్ నేపథ్య సంగీతం : శాంతను మొయిత్రా |
ఛాయాగ్రహణం | రామ తులసి |
కూర్పు | డాన్ మాక్స్ |
భాష | తెలుగు |
నిర్మాణ_సంస్థ | సన్టచ్ ప్రొడక్షన్స్ ప్రజ్వల |
నా బంగారు తల్లి వేశ్యావృత్తి కథాంశంగా రూపొందిన తెలుగు చిత్రం. 'ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా' సినిమాతో అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభించిన దర్శకుడు రాజేశ్ టచ్రివర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రజ్వల సంస్థ నిర్వాహకురాలిగా పరిచయమున్న సునీతా కృష్ణన్ ఈ సినిమా నిర్మాత. ఈ సినిమాను తెలుగుతో పాటుగా మలయాళంలో ఎంతె అనే పేరుతో ఒకే సారి నిర్మించారు. ఈ సినిమా విడుదలకంటే ముందే జాతీయ స్థాయిలో మూడు అవార్డులను గెలుచుకుంది. అలాగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలోనూ ప్రశంసలు పొందింది.
అభంశుభం తెలియని ఎంతో మంది యువతులు లైంగిక వేధింపులకు గురవుతూ నరకప్రాయంగా జీవితాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి ఓ స్త్రీ జీవితగాథే "నా బంగారు తల్లి".
కథ అమలాపురంలో మొదలవుతుంది. శ్రీనివాస్ సమాజ సేవకుడు. అతని ఒక్కగానొక్కొ కూతురు దుర్గ (అంజలీ పాటిల్) తెలివైన విద్యార్థిని. ఇంటర్లో పాఠశాల ఫస్ట్ రావడమే కాదు, ఆ జిల్లాలోనే ఎనిమిదవ ర్యాంక్ సంపాదించుకుంటుంది. అయితే ఆ ఘనత మొత్తం తన తండ్రి శ్రీనివాస్ (సిద్ధిక్)కే దక్కుతుందని, తనతో పాటు ఆయన్నీ సత్కరించమని పాఠశాల యాజమాన్యాన్ని కోరుతుంది. తమ ఊరిలో కాకుండా హైదరాబాద్ వెళ్ళి డిగ్రీ చదవాలన్నది దుర్గ కోరిక. కానీ తండ్రి మాత్రం తమని వదిలి దూరంగా ఉండొద్దని చెబుతుంటాడు. తన కళ్ళముందు ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా సహించలేని మనస్తత్వం దుర్గది. తండ్రి తరహాలోనే ఈ అమ్మాయి కూడా సమాజాన్ని ఉద్ధరిస్తోందంటూ ఊరి వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. అయినా ఆ మాటలను పట్టించుకోకుండా తన దారిన తాను ముందుకు పోతూ ఉంటుంది దుర్గ. తన స్నేహితురాలి పెళ్ళిలోనే దుర్గ మనసుకు నచ్చని వ్యక్తి తారసపడతాడు. పెద్దల అంగీకారంతో విజయ్ (రత్నశేఖర్)తో నిశ్చితార్థం కూడా జరుగుతుంది. అదే సమయంలో హైదరాబాదులో డిగ్రీ చదవడానికి దుర్గకు అవకాశం లభిస్తుంది. తండ్రి అప్పటికే హైదరాబాదులో ఉండటంతో తల్లిని ఒప్పించి నగరానికి ఒంటరిగా బయలుదేరుతుంది. అయితే నగరం చేరిన దుర్గ జీవితంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి, ఈ చదువుల తల్లి ఎలాంటి ఇబ్బందుల్ని, అనూహ్య సంఘటనలను ఎదుర్కొందన్నది మిగతా కథ[1].
ఈ సినిమాకు విడుదలకు ముందే దేశ విదేశాలలో అనేక బహుమతులు లభించాయి. 2013లో డెట్రాయిట్లో జరిగిన ట్రినిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికయింది.[2] 23 సంవత్సరాల తర్వాత ఈ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి తెలుగు సినిమా ఇది. అదే యేడాది జరిగిన ఇండొనేషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాకు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్, బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ ఫిల్మ్మేకర్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఫెస్టివల్ విభాగాలలో నాలుగు అవార్డులు లభించాయి. అంతే కాక 2014లో బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, మైర్టల్ బీచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టిఫల్ ఆఫ్ ఐర్లాండ్, 20వ కోల్కాతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లలో ప్రదర్శనకు అధికారికంగా ఎంపికయ్యింది.
ఇక 61వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డును గెలుచుకుంది.[3] అంతే కాకుండా ఈ పురస్కారాలలో ఈ చిత్ర సంగీత దర్శకుడు శంతను మొయిత్రకు ఉత్తమ సంగీత దర్శకుడు, నటి అంజలి పాటిల్కు ప్రత్యేక ప్రశంస పురస్కారాలు లభించాయి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2013లో ప్రకటించిన నంది పురస్కారాలలో ఈ చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా రజత నందిని గెలుచుకుంది. ఇదే పురస్కారాలలో ఉత్తమ నటిగా అంజలీ పాటిల్కు అవార్డు లభించగా సిద్ధిక్కు ప్రత్యేక జ్యూరీ పురస్కారం లభించింది.[4][5][6][7][8]