పనూన్ కాశ్మీర్ (మన కాశ్మీరు) కాశ్మీర్ లోయలో హిందువులు తమ కోసం ప్రతిపాదించుకున్న కేంద్రపాలిత ప్రాంతం. దీన్ని కాశ్మీరీ హిందువుల మాతృభూమిగా ఉద్దేశించారు. 1990 లో కాశ్మీరీ హిందువుల వలస తర్వాత ఈ డిమాండ్ ఏర్పడింది.[1] [2][3][4][5] 1991 మార్గదర్శన్ తీర్మానంలో మాతృభూమి దార్శనికతను విశదీకరించారు. పనూన్ కాశ్మీర్ అనే పేరుతో ఒక సంస్థ కూడా ఉంది.
పనూన్ కాశ్మీర్ కాశ్మీరీ భాష నుండి వచ్చిన మాట. "మన స్వంత కాశ్మీర్" అని దానికి అర్థం. పనూన్ కాశ్మీర్ సంస్థను కాశ్మీరీ హిందూ రచయిత, కార్యకర్త అగ్నిశేఖర్ తోటి కాశ్మీరీ హిందువులు కలిసి 1990 లో స్థాపించారు. ఉగ్రవాదుల నుండి ఏర్పడిన ముప్పు కారణంగా కాశ్మీరీ హిందువులు కాశ్మీర్ నుండి పెద్దయెత్తున వలస వెళ్ళాక ఈ సంస్థ ఏర్పడింది. కాశ్మీర్లో పెరుగుతున్న సాయుధ తిరుగుబాటు కారణంగా దాదాపు 300,000 [6] నుండి 600,000 కాశ్మీరీ హిందువులు కాశ్మీర్ నుండి వలసపోయారు. అయితే, పనూన్ కాశ్మీర్ అంచనా ప్రకారం ఇది దాదాపు 7,00,000.[7]
1991 డిసెంబరులో జమ్మూలో మార్గదర్శన్ రిజల్యూషన్ [8] అనే పేరుతో ఒక తీర్మానాన్ని సంస్థ ఆమోదించింది. దాని విశేషాలు ఇవి:[9][10]
(ఎ) కాశ్మీరీ లోయలో జీలం నదికి తూర్పు, ఉత్తరాన ఉన్న లోయ ప్రాంతాలను కలిపి కాశ్మీరీ హిందువుల కోసం మాతృభూమిని ఏర్పాటు చేయడం.
(బి) జీవించే హక్కు, స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ, విశ్వాసం, సమానత్వం, చట్ట నియమాలను నిర్ధారించడానికి భారత రాజ్యాంగం ఈ మాతృభూమిలో ప్రత్యక్షరస్ఫూర్తితో వర్తింపజేయబడుతుంది.
(సి) హోంల్యాండ్ను కేంద్రపాలిత ప్రాంత హోదాతో కేంద్ర పరిపాలన కింద ఉంచడం;
(డి) గతంలో కాశ్మీర్ నుండి తరిమివేయబడి, తమ స్వదేశానికి తిరిగి రావాలని తహతహలాడుతున్న వారితో సహా ఏడు లక్షల మంది కాశ్మీరీ హిందువులు, కాశ్మీర్లో ఉగ్రవాద హింస కారణంగా బలవంతంగా విడిచిపెట్టిన వారితో సహా హుందాగా, గౌరవంగా సమానత్వంతో స్థిరపడగలిగే మాతృభూమి.
పనూన్ కాశ్మీర్ కోరే కొందరు, కాశ్మీర్ లోయలో ఎక్కువ భాగం, శ్రీనగర్, అనంత్నాగ్, సోపోర్, బారాముల్లా, అవంతిపోరా వంటి నగరాలను ప్రతిపాదిత కేంద్రపాలిత ప్రాంతంలో చేర్చాలని కోరుతున్నారు. అయితే, తాము హిందూ మాతృభూమిని కోరుకోవడం లేదని ఆ సంస్థ పేర్కొంటూ, ముస్లిం పొరుగువారితో కలిసి శాంతియుతంగా జీవించడానికి సిద్ధంగా ఉన్న కాశ్మీరీ హిందువుల కోసం ఈ మాతృభూమి అని చెప్పింది.
పనూన్ కాశ్మీర్ సంస్థ ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం కోసం నిలకడగా కోరుతూ వస్తోంది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35a ల రద్దును కూడా సంస్థ గట్టిగా సమర్థించింది.[11]
జమ్మూ కాశ్మీరు లోని ఒక రాజకీయ పార్టీ అయిన ఇక్జుట్ జమ్మూ, ప్రత్యేక పనూన్ కాశ్మీర్ కావాలనీ, అలాగే కాశ్మీర్ నుండి జమ్మూ డివిజన్ను వేరు చేయాలనీ బహిరంగంగా కోరుతోంది.[12][13][14]
2019 నవంబరు 28 న, న్యూయార్క్లోని భారత కాన్సుల్ జనరల్, 1989 తిరుగుబాటు తర్వాత ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టిన మైనారిటీ హిందూ సమాజమైన కాశ్మీరీ పండిట్లు తిరిగి రావడానికి కాశ్మీర్ కోసం " ఇజ్రాయెల్ మోడల్ "ను అనుసరించాలని సూచించారు. [15] గంటపాటు సాగిన అతని వీడియో దుమారం రేపింది. దీనివలన సైనిక నియంత్రణ మరింత దిగజారుతుందని, తమల్కు రావలసిన ఉద్యోగాలు బయటివారికి పోతాయని, ముస్లింల మెజారిటీ స్థానాన్ని హిందువులు ఆక్రమించడంతో ముస్లిములు తమ గుర్తింపును కోల్పోతారని కాశ్మీరీ ముస్లింల కార్యకర్తలు కొంతమంది హిందూ కాశ్మీరీలు భయపడ్డారు. ఈ ప్రతిపాదనను "సెటిలర్-కలోనియల్ ప్రాజెక్ట్"తో పోల్చారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రతిపాదనను "భారత ప్రభుత్వ ఫాసిస్ట్ ఆలోచనా ధోరణిని" ప్రతిబింబిస్తున్నట్లు ఖండించాడు.[16][17]
2021 జూన్లో గుర్తుతెలియని మిలిటెంట్లు రాకేష్ పండిట్ను హత్య చేయడంతో, పనూన్ కాశ్మీర్ గ్రూప్లోని పలువురు సభ్యులు ప్రత్యేక హిందూ ప్రాంతాన్ని స్థాపించడానికి సాయుధ పోరాటం చెయ్యాలని ప్రతిపాదించారు. కాశ్మీరీ పండిట్లు స్థానిక మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టాలనేది ఈ ప్రతిపాదన. ఆ సమావేశాన్ని, వారి ప్రతిపాదిత కేంద్ర పాలిత ప్రాంతాన్నీ ముస్లిం కార్యకర్తలు వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదనను, పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన చర్యలతో పోల్చారు.[18][19][20]