బంగారు పంజరం (1969 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | బి.ఎన్.రెడ్డి |
నిర్మాణం | బి.ఎన్.రెడ్డి |
తారాగణం | వాణిశ్రీ (నీల), శోభన్ బాబు (వేణు), శ్రీరంజిని, సత్యనారాయణ, రావి కొండలరావు, బేబి రాణి |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు & బి.గోపాలం |
నేపథ్య గానం | ఘంటసాల, ఎస్. జానకి |
ఛాయాగ్రహణం | కొండారెడ్డి |
కళ | ఎ. కె. శేఖర్ |
నిర్మాణ సంస్థ | వాహిని ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
బంగారు పంజరం 1969, మార్చి 19వ తేదీన ఉగాది కానుకగా విడుదలైన తెలుగు సినిమా.ఇది బి.యన్.రెడ్డి గారికి దర్శకుడిగా చివరి చిత్రం. శోభన్ బాబు , వాణీశ్రీ, జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వరరావు , బి. గోపాలం అందించారు.
హైద్రాబాదులో ఇంజనీరు వేణుగోపాలరావు (శోభన్బాబు). అతని తల్లి (శ్రీరంజని). మేనమామ రామకోటయ్య (రావికొండలరావు), అతని భార్య గౌరి (పుష్పవల్లి), వారి కుమార్తె పద్మ (గీతాంజలి). వారింట దాసి మంధర (నవీనలక్ష్మి). ప్రాజెక్టు పనిమీద శ్రీశైలం వెళ్లిన వేణుకు అక్కడి గ్రామీణ యువతి నీల (వాణిశ్రీ) పరిచయమవుతుంది. ఆమె అందం, అమాయకత్వం చూసి ఇష్టపడిన వేణు, ఆమె తల్లిదండ్రులు త్యాగరాజు, ఉదయలక్ష్మిలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు చదువు, నాగరికత నేర్పుతాడు. వారికొక పాప బుజ్జి (బేబీరాణి). ఎలాగైనా వేణును తన అల్లుడిని చేసుకోవాలన్న రామకోటయ్య ఆశ నెరవేరకపోవటంతో, దాసి మంధర సాయంతో ఆ కార్యం సాధించాలనుకుంటాడు. ఆమె కుట్రలు, మాయోపాయాల కారణంగా నీలను వేణు నిందించటం, తూలనాడటం జరుగుతుంది. ఇదంతా పద్మపై ఇష్టంతో వేణు చేస్తున్నాడని భావించిన నీల ఇల్లు విడిచి వెళ్తుంది. తరువాత నిజం గ్రహించిన వేణు ఆమె కొరకు అన్వేషించి, రైలు ప్రమాదంలో నీల మరణించిందని భావించి మతిస్థిమితం కోల్పోతాడు. రైలు ప్రమాదం నుంచి బయటపడిన నీల నర్సుగా ఓ చోట పనిచేస్తూ, అక్కడి డాక్టరు ద్వారా భర్త గురించి తెలుసుకుంటుంది. తానెవరో తెలియనీయకుండా, అతన్ని తన సేవతో, పాటతో మామూలు మనిషిని చేస్తుంది. తల్లి, భార్య, కూతురితో వేణు దేవిని శివాలయంలో పూజించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ తృతీయ చిత్రంగా,1969 వ సంవత్సరానికి గాను కాంస్య నంది అవార్డు ప్రకటించింది