బాల్య వివాహము అనగా యుక్త వయసు రాక మునుపు అనగా బాల్య దశలో చేసే వివాహము. నేడు చట్ట ప్రకారము 18 సంవత్సరాల వయసు నిండని అమ్మాయికి, 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి జరిగే వివాహమును బాల్య వివాహముగా చెప్పవచ్చు. పూర్వము బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. దీనికి పెక్కు కారణములున్నవి.
ఫ్రెంచివారు, పోర్చుగీసు వారు, డచ్ వారు, బ్రిటీషు వారు మొదలైన విదేశీయులు భారతదేశాన్ని పాలించు కాలంలో కొంతమంది విదేశీ అధికారులు భారతీయ కన్యలను బలవంతంగా వివాహమాడేవారు లేదా చెరచేవారు. వివాహితులను ఎత్తుకెళ్ళరని భావించిన భారతీయులు తమ పిల్లలకు బాల్యంలోనే వివాహం చేసేవారు.
కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలను పటిష్ఠపరచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో పలానావాడికి భార్య పుట్టిందని ఇరువర్గాలవారు నిర్ణయించేసుకొని పిల్లలు కొంచెం పెద్దవారవ్వగానే వివాహం చేసేవారు.
కుటుంబాలలోని వృద్ధుల కోరిక మేరకు వారు చనిపోయేలోపు తమ వారసుల పెళ్ళిళ్ళు చూడాలనే కోరికను తీర్చడానికి కూడా బాల్యవివాహాలు జరిపించేవారు. మరికొన్ని కుటుంబాల్లో పిల్లలు యుక్తవయసు (Teenage) కు వచ్చిన తర్వాత వక్ర మార్గాల్లో ప్రయాణిస్తారనే భావనతో ముందు జాగ్రత్తగా బాల్యవివాహాలు జరిపించేవారు.
బాల్య వివాహం జరిపించినప్పటికీ అమ్మాయి యుక్త వయసుకు వచ్చిన తర్వాత మాత్రమే కాపురానికి పంపింఛేవారు. ఇలా చేయడం వల్ల అమ్మాయికి అబ్బాయికి ఒకరిపై ఒకరు ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి జీవితం గడపాల్సివచ్చేది. అయితే కొన్ని కుటుంబాల్లో అమ్మాయికి ఊహ తెలిసినా తెలియకపోయినా వయసులో ఎక్కువ తేడా ఉన్న వ్యక్తులతో కూడా ఈ వివాహాలు జరిపించేవారు. ఒక వేళ వయసులో ఎక్కువ తేడా వల్ల పురుషుడు ముందుగా చనిపోయినప్పటికీ పునర్వివాహాలు ఉండేవి కావు. అందువల్ల అమ్మాయి చిన్నవయసులోనే బాల వితంతువుగా మారి జీవితాంతం అలాగే ఉండాల్సివచ్చేది.
రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘసంస్కర్తల కృషి ఫలితంగా రాను రాను ప్రజల్లో బాల్యవివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెరిగి బాల్యవివాహాలను నిషేధించడం, పునర్వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో అక్కడక్కడా అడపాదడపా ఇలాంటి బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.
(Baalya vivahaalu neramu Say no to child marriages)