బుమ్ లా కనుమ | |
---|---|
![]() బుమ్ లా కనుమ వద్ద ఉన్న సరిహద్దు సిబ్బంది సమావేశ స్థలం | |
సముద్ర మట్టం నుండి ఎత్తు | 15,200 అడుగులు (4,600 మీ.) |
ప్రదేశం | తవాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం త్సోనా జిల్లా, టిబెట్, చైనా |
శ్రేణి | హిమాలయాలు |
Coordinates | 27°43′25″N 91°53′30″E / 27.7236979°N 91.8916106°E |
బుమ్ లా కనుమ, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాకూ, టిబెట్లోని త్సోనా కౌంటీకీ మధ్య నున్న సరిహద్దు కనుమ.[1] ఇది తవాంగ్ జిల్లాలోని తవాంగ్ పట్టణం నుండి 37 కి.మీ. దూరం లోను, చైనాలోని త్సోనా కౌంటీలోని త్సోనా జాంగ్ పట్టణం నుండి 43 కి.మీ. దూరం లోనూ ఉంది. ఈ కనుమ ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ల మధ్య వ్యాపార కేంద్రంగా పనిచేస్తోంది.[2] ఇది చైనా, భారత భద్రతా దళాలు పరస్పరం అధికారికంగా గుర్తించిన బోర్డర్ పర్సనల్ మీటింగ్ పాయింట్ కూడా.
వ్యాపారులు ఉపయోగించిన పాత రహదారి ఒకటి తవాంగ్ నుండి మిలాకటాంగ్ లా (టిబెటన్ భాషలో "లా" అంటే "పాస్") మీదుగా బమ్ లా పాస్ వరకూ, అక్కడినుండి చివరికి టిబెట్లోని త్సోనా జాంగ్కూ వెళ్తుంది.
బమ్ లాకు వెళ్లే మార్గం ఒక చారిత్రిక మార్గం కూడా. 1962 చైనా-భారత యుద్ధం సమయంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారతదేశంపై దాడి చేసింది. ఇక్కడ బమ్ లా పాస్లో 1962 చైనా-భారత యుద్ధంలో భీకర యుద్ధం ఒకటి జరిగింది.
2006 లో, 44 సంవత్సరాల తరువాత, బుమ్లా కనుమను వ్యాపారులకు తిరిగి తెరిచారు. ఇరు దేశాలకు చెందిన పోస్టల్ ఉద్యోగులతో పాటు, వ్యాపారులను కూడా అటూ ఇటూ వెళ్ళేందుకు అనుమతించారు.[3][2]
ఇది దాదాపు సంవత్సరం పొడవునా భారీ మంచుతో కప్పబడి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆఫ్-బీట్ కనుమలలో ఒకటి.[4]
భారత సైన్యం అనుమతితో భారతదేశంలోని పౌర పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనుమతిస్తారు. ఈ ట్రాక్ చాలా ప్రమాదకరమైనది, SUVలు మాత్రమే వెళ్ళగలిగే వీలున్నది. అవి కూడా హిమపాతం లేదా వర్షపాతం లేని స్పష్టమైన వాతావరణం రోజున మాత్రమే వెళ్ళగలవు.
భూకంపంలో రాళ్లు, బండరాళ్లు, చెట్లు పడిపోవడంతో ఏర్పడిన సరస్సు షుంగాట్సర్ త్సో సరస్సు (సరస్సును టిబెటన్లో త్సో అంటారు). ఇక్కడ మాధురీ దీక్షిత్ నటించిన కోయిలా చిత్రాన్ని చిత్రీకరించారు. అంచేత ఈ సరస్సును కొన్నిసార్లు మాధురీ సరస్సు అని కూడా పిలుస్తారు. సరస్సు తవాంగ్ పట్టణం నుండి సుమారు 20 కి.మీ. దూరంలో, సుమారు బం లా పాస్కు వెళ్లే రహదారి విభజన నుండి 7 కి.మీ. దూరంలో ఉంటుంది.
ఇక్కడ ఒక రాళ్ల కుప్ప ఉంది, మహోన్నత హిమాలయాలు ఉత్తర సరిహద్దులను సంరక్షిస్తున్నందుకు కృతజ్ఞతా సూచనగా సందర్శకులు ఇక్కడ గులకరాళ్ళను ఉంచుతారు. ఇక్కడ చైనా-భారత స్నేహ చిహ్నం కూడా ఉంది.[5][6][7]
భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి రెండు సైన్యాల మధ్య పరస్పర సంప్రదింపుల కోసం అధికారికంగా అంగీకరించబడిన ఐదు సరిహద్దు సిబ్బంది సమావేశ పాయింట్లలో ఇది ఒకటి.[8]
ఇక్కడ, భారతదేశం వైపున ఒక గుడిసె ఉంది. ఇక్కడే ఇరు సైన్యాలు సరిహద్దు సమావేశాలను నిర్వహిస్తాయి.
బమ్ లా పాస్ని సందర్శించడానికి ప్రత్యేక అనుమతి అవసరం. దీని కోసం డిప్యూటీ కమీషనర్ కార్యాలయంలో అభ్యర్థించాలి. తవాంగ్లోని భారత సైన్యం కంటోన్మెంట్లో దానిపై స్టాంపు వేయించుకోవాలి. ఆర్మీ స్టాంపు లేనిదే, దారిలో ఉన్న చెక్ పోస్ట్ల వద్ద సందర్శకులను అనుమతించరు.[9]