పూర్తి శీర్షిక | భారత ప్రభుత్వానికి సంబంధించి మరిన్ని అంశాలను పొందుపరచడం. |
---|---|
ఉల్లేఖనం | 9 & 10 Geo. 5 c. 101 |
తేదీలు | |
రాచరికపు ఆమోదం పొందిన తేదీ | 1919 డిసెంబరు 23 |
ఇతర శాసనాలు | |
Repealed by | Statute Law (Repeals) Act 1976 |
స్థితి: Repealed |
భారత ప్రభుత్వ చట్టం 1919 అనేది యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు జారీ చేసిన చట్టం. భారత ప్రభుత్వంలో భారతీయుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు దీన్ని రూపొందించారు. భారతదేశానికి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎడ్విన్ మోంటాగు, వైస్రాయి చెమ్స్ఫోర్డ్ లు తమ నివేదికలో సిఫార్సు చేసిన సంస్కరణలను ఈ చట్టంలో పొందుపరిచారు. ఈ చట్టం 1919 నుండి 1929 వరకు పదేళ్లపాటు వర్తిస్తుంది. దయగల నిరంకుశత్వానికి (అధికారులు తమను తాము మెరుగుపరుచుకునే చర్య) ముగింపు పలికి భారతదేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రారంభించడానికి ఈ చట్టం గుర్తు. దీన్ని రూపొందించిన 10 సంవత్సరాల తరువాత దీన్ని సమీక్షించేందుకు సైమన్ కమిషన్ ఏర్పాటు చేసారు.
ఈ చట్టంపై 1919 డిసెంబరు 23 న రాజ ముద్ర పడింది. అదే రోజున చక్రవర్తి భారతదేశానికి సంబంధించిన పార్లమెంటరీ చట్టం ఉద్దేశ్యాన్ని సమీక్షిస్తూ ఒక ప్రకటనను జారీ చేశాడు:
"1773, 1784 చట్టాలు ఈస్టిండియా కంపెనీ క్రింద ఒక సాధారణ పరిపాలనను, న్యాయ వ్యవస్థనూ స్థాపించడానికి రూపొందించబడ్డాయి. 1833 చట్టం భారతీయులకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలకు తలుపులు తెరిచింది. 1858 చట్టం కంపెనీ నుండి పరిపాలనను రాజ్యానికి బదిలీ చేసింది. నేడు భారతదేశంలో ఉన్న ప్రజా జీవితానికి ఇది పునాదులు వేసింది. 1861 చట్టం ప్రాతినిధ్య సంస్థల విత్తనాన్ని నాటింది. 1909 చట్టం ఈ విత్తనానికి జీవం పోసింది. ఇప్పుడు చట్టంగా మారిన ఈ బిల్లు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధికి ప్రభుత్వంలో ఖచ్చితమైన వాటాను అప్పగిస్తుంది. ఇకపై పూర్తి బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి మార్గాన్ని చూపుతుంది" [1]
ఈ చట్టం ప్రధాన ప్రావిన్సులకు ద్వంద్వ ప్రభుత్వాన్ని (" డయార్కీ ") అందించింది. అటువంటి ప్రతి ప్రావిన్స్లో, ప్రభుత్వ పాలన లోని కొన్ని అంశాల - "బదిలీ చేయబడిన జాబితా" - నియంత్రణను ప్రావిన్షియల్ కౌన్సిల్కు జవాబుదారీగా ఉండే మంత్రుల ప్రభుత్వానికి ఇవ్వబడ్డాయి. 'బదిలీ చేయబడిన జాబితా'లో వ్యవసాయం, స్థానిక ప్రభుత్వాల పర్యవేక్షణ, ఆరోగ్యం, విద్య ఉన్నాయి. ప్రావిన్షియల్ కౌన్సిల్లను విస్తరించారు.
అదే సమయంలో, ప్రభుత్వంలోని అన్ని ఇతర అంశాలను ('రిజర్వ్డ్ లిస్ట్') వైస్రాయి నియంత్రణలోనే ఉంచారు. 'రిజర్వ్ చేయబడిన జాబితాలో' రక్షణ (సైన్యం), విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లూ ఉన్నాయి.
ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విస్తరించి, సంస్కరించారు. ఇది యావత్ భారతదేశానికి రెండు సభల శాసనసభగా మారింది. దిగువ సభ, 145 మంది సభ్యులతో కూడిన శాసనసభ. అందులో 104 మంది ఎన్నికైన సభ్యులు, 41 మంది నామినేట్ అయినవారూ ఉంటారు. వీరి పదవీకాలం మూడేళ్ళు. ఎగువ సభ అనేది కౌన్సిల్ ఆఫ్ స్టేట్, ఇందులో 34 మంది ఎన్నుకైన వారు, 26 మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం ఐదేళ్ళు. [2]
చట్టం లోని ముఖ్య లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:
భారత జాతీయ కాంగ్రెస్ ఈ చట్టాన్ని తిరస్కరించింది. అయితే అన్నీ బెసెంట్, GS ఖపర్డే, బిపిన్ చంద్ర పాల్, సురేంద్రనాథ్ బెనర్జీ, తేజ్ బహదూర్ సప్రూ వంటి కొందరు నాయకులు ఈ చట్టాన్ని ఆమోదించారు. ప్రభుత్వంతో సహకరించడానికి సిద్ధమయ్యారు. వారు కాంగ్రెస్ను వీడారు. సురేంద్రనాథ్ బెనర్జీ, తేజ్ బహదూర్ సప్రూలు ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ను ఏర్పాటు చేశారు. వారిని "లిబరల్స్" అని పిలుస్తారు. మదన్ మోహన్ మాలవీయ సంస్కరణలకు మద్దతు ఇచ్చాడు. ముహమ్మద్ అలీ జిన్నా భారత జాతీయ కాంగ్రెస్కు రాజీనామా చేశాడు.