భాల్కా తీర్థం, గుజరాత్ లోని సౌరాష్ట్రంలో ఉన్న వీరవల్ దగ్గర్లోని ప్రభాస్ క్షేత్రంలో ఉంది. ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు నిర్యాణం జరిగిందని పురాణ గాథ. ఇక్కడే కృష్ణుడు పడుకుని ఉండగా, జారా అనే వేటగాడు ఆయన బొటనవేలును బాణంపెట్టి కొట్టగా, కృష్ణుడు అవతార సమాప్తం చేసి, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. ఈ కథకు సంబంధించి సంస్కృతంలో శ్రీ కృష్ణ నీజ్ధాం ప్రస్థాన్ లీలా అనే నాటకం కూడా ఉంది.[1][2]
మహాభారతం ప్రకారం కురుక్షేత్రం జరుగుతున్న సమయంలో, దుర్యోధనుడి మరణానికి ముందురోజు రాత్రి శ్రీకృష్ణుడు గాంధారిని పలకరించడానికి వెళ్తాడు. అప్పటికే తన కొడుకుల్లో చాలామందిని కోల్పోయిన గాంధారి, కృష్ణునిపై కోపం వహిస్తుంది. యుద్ధాన్ని రాకుండా చేయలేకపోయావంటూ కృష్ణున్ని తిడుతుంది. కృష్ణుడూ, యాదవ వంశం రానున్న 36 ఏళ్ళలో నాశనమవుతుందని శపించింది. ఇదంతా జరగవలసిందే అని ముందే తెలిసిన కృష్ణుడు తథాస్తు అంటాడు.[3][4][5]
36ఏళ్ళ తరువాత ఒక ఉత్సవం సమయంలో యాదవులలో గొడవలు బయలుదేరి, ఒకరిని ఒకరు చంపుకున్నారు. కృష్ణుని అన్నగారు బలరాముడు యోగం ద్వారా శరీరం వదిలేశాడు. శ్రీకృష్ణుడు కూడా అడవికి వెళ్ళి, ఒక చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. అలానే పడుకుని విశ్రమిస్తుండగా జారా అనే వేటగాడు కృష్ణుని ఎడమకాలి బొటనవేలును చూసి లేడి అనుకుని, బాణం వేసి కొట్టాడు. రక్తమోడుతూ, బాధపడుతున్న కృష్ణుణ్ణి చూసి తన తప్పు తెలుసుకున్న వేటగాడు చాలా బాధపడతాడు. అప్పుడు కృష్ణుడు జారునితో " జారా త్రేతాయుగంలో రామావతారంలో నేను ఉన్నప్పుడు నాచే చంపబడిన వాలివి నువ్వు. ఈ ప్రపంచంలో జరిగేవన్నీ నా ఇష్టా ఇష్టాలతోనే జరుగుతాయి. దీనికి నీ బాధ్యత ఏం లేదు" అని చెప్పాడు. అలా శ్రీకృష్ణుడు సశరీరంగా తన లోకమైన గోకుల బృందావనానికి వెళ్ళిపోతాడు.[6][7][8][9] ఈ విషయాన్ని చూసినవారు హస్తినాపురానికీ , ద్వారకకీ చేరవేశారు.[6] సోమనాథ్ ఆలయం దగ్గర్లోని భాల్కా అనే ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుని నిర్యాణం జరిగింది.[1][2]
పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని అవతార సమాప్తంతో ద్వాపర యుగం ముగిసి, కలియుగం మొదలు అయింది. ప్రస్తుత కాలమాన కొలమానాల ప్రకారం క్రీ.పూ. 3102 సంవత్సరంలో ఫిబ్రవరి 17/18 నాడు జరిగి ఉండవచ్చని ఒక అంచనా.[10]