మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు.[1] జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ప్రతి మండలానికి సాధారణంగా ఒక మండల పరిషత్తు వుంటుంది. దీని పరిధిలో 20 నుండి 30 గ్రామ పంచాయతీలు వుంటాయి. వీటి అభివృద్ధికి పనిచేస్తుంది. మండల పరిషత్కు పన్నులు విధించే అధికారం లేదు. జిల్లా పరిషత్, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులను వినియోగిస్తుంది. అభివృద్ధిలో ఒక యూనిట్గా గ్రామాల మధ్య సమన్వయానికి కృషిచేస్తుంది.
మండల పరిషత్ లో రెవెన్యూ డిపార్ట్ మెంట్ నుండి తహసీల్ దారు, పంచాయితీరాజ్ డిపార్ట్ మెంట్ నుండి ఎంపీడివో, జిల్లా పరిషత్తు సభ్యుడు, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీ (MPTC)) ఉంటారు. దీనికి అధ్యక్షత మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంపీటీసీ (MPTC) నిర్వహిస్తారు.
1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టము లోని సెక్షన్ 172 మండల పరిషత్తు ఆదాయ-వ్యయాలను వివరిస్తుంది.[2]
ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకోటానికి మండలాన్ని కొన్ని ప్రాదేశిక నియోజక వర్గాలుగా విభజిస్తారు. వీరిని ఎంపిటిసి (Mandal Parishad Territorial Constituency : MPTC) సభ్యులంటారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టవచ్చు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. వీరితో పాటు, మండలానికి ప్రాతినిధ్యం వహించే విధానసభ, లోక్సభ సభ్యులు, మండలంలో నివాసముంటున్న రాజ్యసభ సభ్యులు, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన సభచే ఆహ్వానించబడిన (కో ఆప్టెడ్) వారు సభ్యులుగా వుంటారు. సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు: జిల్లా కలెక్టర్, మండల పరిధిలో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, మండల పరిధిలో మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు. వీరికి సమావేశాలలో ఓటు హక్కు లేదు.
ఎంపిటిసి సభ్యుల మొదటి సమావేశంలో, వారిలో ఇద్దరిని అధ్యక్షుడు, ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. అధ్యక్ష పదవికి, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక బహిరంగ ఓటు విధానం ద్వారా అంటే చేతులెత్తడం ద్వారా జరుగుతుంది. ఎన్నికలో బలాబలాలు సమానమైతే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
మండలంలో ముఖ్య కార్యనిర్వాహక అధికారిని మండల అభివృద్ధి అధికారి (ఎమ్పిడివో) (Mandal Parishad Development Officer (MPDO)అంటారు. మండల పరిషత్తు నిర్ణయాలను అమలు పరచటం, ఈ అధికారి విధి. మండలంలోని ప్రభుత్వ సిబ్బందికి నాయకత్వం వహిస్తారు. ఆయితే రెవెన్యూ విభాగానికి, మండల రెవెన్యూ అధికారి అధిపతిగా వుంటారు.
ప్రతి మండల పరిషత్తులో మూడు స్థాయి సంఘాలు ఏర్పాటుచేయాలి. వీటిలో సహజ వనరులు, మానవ వనరులు, మౌలిక వసతులకు సంబంధించి కమిటీలు ఉంటాయి. సహజ వనరుల కమిటీలో వ్యవసాయం, పశుపోషణ, మత్య్స పరిశ్రమ, రక్షిత మంచినీరు, వాటర్షెడ్లు తదితర అంశాలు ఉంటాయి. దీనికి ఎంపీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మౌలిక వసతుల కమిటీలో రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టులు తదితరమైనవి ఉంటాయి. ఈ కమిటీకి మండల ఉపాధ్యక్షుడు బాధ్యులుగా ఉంటారు. ఇక మానవ వనరుల కమిటీలో విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం, శిశు, మహిళ, వికలాంగ, వృద్ధుల సంక్షేమం వగైరా ఉంటాయి. ఈ కమిటీకి మండల ప్రాదేశిక నియోజకవర్గంనుంచి ఎన్నికైన మహిళా సభ్యురాలు ఛైర్ పర్సన్గా వ్యవహరిస్తారు. ఈ మూడు కమిటీలకు ఎంపీడీవో కన్వీనర్గా వ్యవహరించాలి. జిల్లా పరిషత్తు పాలన మాదిరిగానే మండల పరిషత్తుల్లోనూ స్థాయీ సంఘాలను ఏర్పాటు చెయ్యాలన్న ఆలోచనతో ప్రభుత్వం 2008లో 148 జీవో జారీచేసింది. స్థాయి సంఘాల ఏర్పాటు ద్వారా మండలంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించి, ఆదాయ మార్గాలను అన్వేషించి, వనరులను సమీకరించుకోవాలన్నది ఉద్దేశం.
స్థాయి సంఘాల ఏర్పాటు జరిగితే జవాబుదారీతనం పెరుగుతుంది. కమిటీలు సమావేశాలు నిర్వహించి, తీర్మానాలు చేయాలి. ఎంపీపీ, ఉపాధ్యక్షులకు పొసగకపోవడం, జడ్పీ మాదిరిగా మండల పరిషత్తు స్థాయి సంఘ సభ్యులకు నిర్ణయాధికారాలు లేకపోవటం లక్ష్యాన్ని నీరుగార్చింది.మండల పరిషత్తు పరిధిలో ఏర్పాటుచేయాల్సిన స్థాయి సంఘ కమిటీలు ప్రతి రెండు నెలలకోసారైనా విధిగా సమావేశం కావాలి. సమావేశానికి ఐదు రోజులకు ముందు సభ్యులకు అజెండా ఇచ్చి సమావేశంలో ఆయా అంశాలపై చర్చించాలి. ఆయా శాఖల అధికారులు విధిగా సమావేశాలకు హాజరుకావాలి. ఎంపీపీలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ అంశంపై ఈ స్థాయిసంఘ కమిటీలు, అధికారుల అభిప్రాయాన్ని సేకరించాలి.