మదురై ఎన్.కృష్ణన్ | |
---|---|
జననం | మదురై, తమిళనాడు, భారతదేశం | 1928 అక్టోబరు 31
మరణం | 2005 అక్టోబరు 9 చెన్నై, తమిళనాడు, భారతదేశం | (వయసు 76)
ఇతర పేర్లు | మదురై నారాయణన్ కృష్ణన్ అయ్యంగార్ |
వృత్తి | గాయకుడు, గీత రచయిత, స్వరకర్త |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కర్ణాటక గాత్రసంగీతం |
పురస్కారాలు |
|
మదురై నారాయణన్ కృష్ణన్ (1928–2005) భారతీయ కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్ర విద్వాంసుడు. ఇతడు గాయకుడిగా, గీతరచయితగా, సంగీతస్వరకర్తగా రాణించాడు. ఇతడిని "వాగ్గేయకారుడి"గా పలువురు వర్ణిస్తున్నారు. ఇతనికి భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారం, 2003లో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.[1] ఇతనికి సంగీత నాటక అకాడమీ అవార్డు, కళైమామణి పురస్కారం, యునెస్కో అవార్డులు కూడా లభించాయి.
మదురై ఎన్.కృష్ణన్ 1928, అక్టోబరు 31వ తేదీన తమిళనాడులోని మదురై పట్టణంలో సంగీత కళాకారుల కుటుంబంలో[2] జన్మించాడు.[3] ఇతని తండ్రి మదురై నారాయణ అయ్యంగార్ ఒక హరికథావిద్వాంసుడు. ఇతని అన్న మదురై ఎన్.శ్రీనివాస అయ్యంగార్ వయోలిన్ విద్వాంసుడు. అరియకుడి రామానుజ అయ్యంగార్, రామనాథపురం పూచి శ్రీనివాస అయ్యంగార్లు ఇతని సమీప బంధువులు. ఇతడు తన తండ్రి వద్ద, అన్న వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నాడు. తరువాత కారైకుడిలోని తమిళ్ సంగీత పాఠశాలలో చేరాడు.[4] తరువాత ఇతడు అరియకుడి రామానుజ అయ్యంగార్ వద్ద 18 సంవత్సరాలు గురుకుల పద్ధతిలో సంగీతాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఇతని మొట్టమొదటి కచేరీ తిరుపతిలో పాల్గాట్ మణి అయ్యర్, వెల్లూర్ జి.రామభద్రన్ల వాద్యసహకారంతో జరిగింది.[5]
ఇతనికి గాత్రంతో పాటు మృదంగంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఇతడు అనేక జతిస్వరాలు, వర్ణాలు, తిల్లానాలు, పదములు, జావళీలు రచించాడు.[6] అంతే కాకుండా తిరుప్పావై, నాలాయిర దివ్య ప్రబంధము, తిరువాసగం వంటి తమిళ సాహిత్యాన్ని సంగీత నృత్య రూపకాలుగా మలిచి వాటికి సంగీతం సమకూర్చాడు.[4] ఇతడు సంగీతానికి చెందిన గాత్రం, సాహిత్యం, స్వరకల్పన అనే మూడు పార్శ్వాలలో నైపుణ్యం సంపాదించి వాగ్గేయకారుడుగా పిలువబడ్డాడు.[7] ఇతడు సంగీతం సమకూర్చిన నృత్యరూపకాలను సుధారాణి రఘుపతి, చిత్రా విశ్వేశ్వరన్ వంటి అనేక మంది నాట్యకళాకారిణులు ప్రదర్శించారు. 1965లో ఇతడు చిత్రా విశ్వేశ్వరన్తో కలిసి శ్రీ భరతాలయ అనే సంగీత నృత్య అకాడమీని స్థాపించి దానికి డైరెక్టర్గా వ్యవహరించాడు.[2]
ఇతడు మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో తన 76వయేట 2005, అక్టోబరు 9వ తేదీన చెన్నైలో మరణించాడు.[8] ఇతనికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు.[9]
ఇతడు ఆల్ ఇండియా రేడియో ఏ గ్రేడు కళాకారుడిగా ఎన్నుకోబడ్డాడు. 1970లో యునెస్కో అవార్డు, 1981లో కళైమామణి పురస్కారం లభించింది.[9] 1988లో ఇతడు సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికయ్యాడు.[10] ఇతడు 1991లో మన దేశపు నాలుగవ అత్యున్నత పౌరపురస్కారం పద్మశ్రీని దక్కించుకున్నాడు.[1] 2003లో భారత ప్రభుత్వం మూడవ అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్తో సత్కరించింది.[11] ఇంకా ఇతనికి ది ఇండియన్ ఫైన్ఆర్ట్స్ సొసైటీ వారి "సంగీత కళా శిఖామణి"[9] బ్రహ్మజ్ఞాన సభ వారి "జ్ఞానపద్మం"[3] బిరుదులు లభించాయి.