అలహాబాద్ ప్రసంగం (Urdu: خطبہ الہ آباد) అన్నది పాకిస్తానీ పండితుడు, పాకిస్తాన్ చరిత్రలో సుప్రసిద్ధుడు అయిన మహమ్మద్ ఇక్బాల్ చేసిన చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రసంగం.బ్రిటీష్ ఇండియాలోని అలహాబాద్ నగరంలో జరిగిన ఆలిండియా ముస్లిం లీగ్ 25వ వార్షిక సమావేశాల్లో 29 డిసెంబర్ 1930న ఈ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ఇక్బాల్ వాయువ్య భారతదేశంలోని ముస్లిం సంఖ్యాధిక్య ప్రావిన్సులను స్వతంత్ర రాజ్యంగా ఏర్పరచాలన్న ప్రతిపాదన చేశారు. తద్వారా భారత ఉపఖండంలోని ముస్లింలు వేరే జాతి అని, వారికి మిగతా ప్రాంతాలు, మతాల నుంచి రాజకీయ స్వాతంత్రం ఇవ్వాలని వాదించే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తొలి రాజకీయ నాయకునిగా నిలిచారు.[1]
ఇక్బాల్ భారత ఉపఖండంలోని ముస్లింలను ఒక జాతిగా నిర్వచించి, వారిని ఒక జాతిగా అంగీకరిస్తూ, ముస్లిం సంఖ్యాధిక్య ప్రాంతాలకు హిందూ సంఖ్యాధిక్య ప్రాంతాలతో సమానమైన అధికారాలను ఇస్తూ సమాఖ్య ఏర్పరచకపోతే భారతదేశంలో శాంతి సాధ్యం కాదని సూచించారు. ముస్లింలు, హిందువులు తమ తమ సాంస్కృతిక విలువలను సుసంపన్నం చేసుకుంటూ, అభివృద్ధి చెందగల ఏకైక మార్గం అదేనని ప్రకటించారు. తన ప్రసంగంలో భాగంగా, క్రైస్తవానికి భిన్నంగా ఇస్లాం పౌర జీవనంలో ప్రాధాన్యత కలిగిన న్యాయ విధానాలను, సామాజిక క్రమం నుంచి విడదీయరాని తన మత సిద్ధాంతాలను తీసుకుని మరీ వచ్చింది: "కనుక ఇస్లామిక్ సంఘీభావం అన్న మత సిద్ధాంతాన్ని ధిక్కరించేదిగా ఉన్న జాతీయ పాలసీల నిర్మాణం, ఒక ముస్లిం ఊహించడానికి కూడా సాధ్యం కానిది."[2]
ఇక్బాల్ ముస్లిం సమాజాల రాజకీయ ఐక్యత మాత్రమే ప్రబోధించడం కాకుండా ఇస్లామిక్ సిద్ధాంతాలకు అనుగుణంగా లేని విస్తృత సమాజంలోకి ముస్లిం ప్రజలను మిళితం చేయడానికి అయిష్టతను కూడా నొక్కిచెప్పారు. ఏదేమైనా ఆయన లౌకికత, జాతీయతలను నిరాకరించినా తను ఆశించే ఆదర్శ ఇస్లామిక్ రాజ్యం మత ప్రధాన రాజ్యంగా ఉండాలనేమీ స్పష్టంగా వివరించడం, ప్రత్యేకార్థం చెప్పడం చేయలేదు. ఇక్బాల్ జీవితంలోని తర్వాతి భాగం అంతా రాజకీయ కార్యకలాపాల్లో గడిచింది. ముస్లిం లీగ్ కు రాజకీయ, ఆర్థిక మద్దతు కూడగట్టేందుకు ఐరోపా, పశ్చిమాసియా ప్రాంతాల్లో ప్రయాణించారు, తన ఆలోచనలు తిరిగి 1932 ప్రసంగంలోనూ, మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలోనూ మాట్లాడారు, ముస్లిం ప్రావిన్సులకు తగినంత స్వయం ప్రతిపత్తి లేకుండా అధికార బదిలీని అంగీకరించబోమంటూ కాంగ్రెస్ ని వ్యతిరేకించారు.[1]