మాంధార | |
---|---|
![]() ఇంద్రుడి రూపంలో మాంధాతకు సూచనలిస్తున్న కృష్ణుడు | |
పిల్లలు | పురుకుత్సుడు, అంబరీషుడు, ముచికుందుడు |
పాఠ్యగ్రంథాలు | మహాభారతం |
తండ్రి | యువనాశ్వుడు |
రాజవంశం | సూర్యవంశం |
మాంధాత అంటే సూర్యవంశంలో ఒక శాఖ అయిన రఘువంశానికి చెందిన మహారాజు.[1] శ్రీరాముడు కూడా ఇదే వంశంలో జన్మించాడు. మాంధాత ఈ చరిత్ర ముందుకాలానికి చెందినవాడని హిందువుల విశ్వాసం. ఋగ్వేదంలో ఒక సూక్తం ప్రకారం ఈయన ప్రపంచాన్నంతటినీ జయించిన చక్రవర్తి. మహాభారతంలో ఈయన తండ్రి పేరు యువనాశ్వుడు అని పేర్కొన్నారు.[2][3] వనపర్వం, ద్రోణపర్వం, శాంతిపర్వంలో ఈయన గురించి ప్రస్తావన వస్తుంది. ఈయన యదువంశానికి చెందిన శశబిందు మహారాజు కుమార్తె బిందుమతిని వివాహం చేసుకున్నాడు. పురాణాల ప్రకారం ఈయనకి పురుకుత్సుడు, అంబరీషుడు, ముచికుందుడు అని ముగ్గురు కుమారులు. మాంధాత గొప్పతనానికి, దయా, దాన గుణాలకు ప్రసిద్ధి.
ఒకసారి అయోధ్య రాజు యువనాశ్వుడు వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నవేళకు ఆయనకు బాగా దాహం వేసింది. నీటి కోసం వెతుకుతుండగా ఆయనకు ఒకచోట యజ్ఞ హవిస్సు (నెయ్యి) కనిపించింది. దాన్ని తాగడంతో ఆయనలో ఒక శిశువు పెరుగుతున్నాడని గమనించాడు. అశ్వినీ దేవతలు ఆ బిడ్డను ఆయన నుంచి బయటకు తీశారు. ఆ బిడ్డను ఎలా బ్రతికించాలా అని దేవతలు చూస్తుండగా ఇంద్రుడు తన వేలి నుంచి అమృతాన్ని ఆ బిడ్డ నోట్లో పోశాడు. అలా ఆ బిడ్డ పెరిగి అత్యంత శక్తివంతుడయ్యాడు.[4]