మోహన్ చరణ్ మాఝీ 2024 ఒడిశా శాసనసభ ఎన్నికలలో కియోంజర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాడు. మొహన్ చరణ్ మాఝీ బీజేడీ అభ్యర్థిపై 11577 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
2024 జూన్ 11న భారతీయ జనతాపార్టీ తరుపున ఒడిశా ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన మొదటి ముఖ్యమంత్రి.[5]
మోహన్ చరణ్ మాఝీ 1972 జనవరి 6న కెందుఝార్ జిల్లా లోని రాయికల్ గ్రామంలోని ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు.[6][7] అతని తండ్రి గుణరామ్ మాఝీ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో జవానుగా పనిచేశారు.[8] అతని కుటుంబం సంతాల్ ఆదివాసీ వర్గానికి చెందింది.[9][10]అతను 1987లో తన పాఠశాల విద్యను ఝుంపురా హైస్కూల్లో చదివాడు. 1990లో అనదాపూర్ కళాశాల నుండి తన హయ్యర్ సెకండరీని పూర్తి చేసాడు. అతను చంపువాలోని చంద్ర శేఖర్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని, ధెంకనల్ లా కాలేజీ నుండి ఎల్.ఎల్.బి. పొందాడు. అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహిస్తున్న పాఠశాలల నెట్వర్క్లో భాగమైన జుంపురాలోని సరస్వతి శిశు మందిర్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.[11][12] అతను ప్రియాంక మరాండీని వివాహం చేసుకున్నాడు.[13]
మాఝీ 1997 నుండి 2000 వరకు రాయికల్ పంచాయతీ గ్రామ సర్పంచ్గా పనిచేశారు.[14]అతను 1997 నుండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యూనిట్ గిరిజన విభాగానికి కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.[15] మాఝీ 2000లో కియోంఝర్ నుండి మొదటిసారి ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యారు.[16]అతను 2004లో తిరిగి ఎన్నికయ్యాడు. 2005 నుండి 2009 వరకు ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్గా పనిచేశాడు.[17][18]మాఝీ 2009 - 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఓడిపోయారు, కానీ 2019లో అదే నియోజకవర్గం నుండి గెలుపొందాడు. బిజెపి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారడంతో, మాఝీ పార్టీ చీఫ్ విప్గా నియమితులయ్యారు.[19] అతను షెడ్యూల్డ్ కులాలు, తెగల స్టాండింగ్ కమిటీ సభ్యుడు. 2022 నుండి 2024 వరకు రాష్ట్రంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేసాడు.[20][21]
2021 అక్టోబరు 10న, కెందుఝర్ జిల్లా లోని మాండువా సమీపంలో మాఝీ కారుపై రెండు మూడు బాంబులు విసిరారు. అతని కారుకు స్వల్ప నష్టం జరగగా, మాఝీ గాయాలు లేకుండా బయటపడ్డాడు.[22][23]2023 సెప్టెంబరులో, మాఝీని ఒడిశా శాసనసభ నుండి అప్పటి స్పీకర్ప్రమీలా మల్లిక్ ఆమె పోడియంపై పప్పు విసిరినందుకు సస్పెండ్ చేశారు. ప్రభుత్వం చేసిన వివిధ పప్పుధాన్యాల సేకరణలో ఆరోపించిన కుంభకోణానికి వ్యతిరేకంగా పప్పులు విసిసరటం ద్వారా నిరసన తెలిపారు.[24][25]
2024 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో, మాఝీ నాల్గవ సారి కియోంజర్ స్థానాన్ని గెలుచుకున్నారు. ఒడిశా అసెంబ్లీలో 147 స్థానాలకు గాను 79 స్థానాలతో బిజెపి పార్టీ మెజారిటీ సాధించింది. మాఝీ 2024 జూన్ 11న ఒడిశా ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.[26] అతను మరుసటి రోజు 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు. ముఖ్యమంత్రులలో పనిచేసిన సంతాల్ తెగ సమాజానికి చెందిన హేమానంద బిస్వాల్. గిరిధర్ గమాంగ్ తర్వాత మాఝీ మూడవ వ్యక్తి.[27]