![]() | |
రకం | ప్రజా |
---|---|
స్థాపితం | 1998 |
ఛాన్సలర్ | ఫిరోజ్ బఖ్త్ అహ్మద్ |
వైస్ ఛాన్సలర్ | ప్రొ. ఆయూబ్ ఖాన్ (ఐ/సి) |
విద్యార్థులు | సుమారు 7000 (ప్రాంగణం) |
చిరునామ | ఉర్దూ విశ్వవిద్యాలయ రహదారి, ఎల్&టి టవర్స్ పక్కన, టెలికాం నగర్, గచ్చిబౌలి 500032, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం 500032 17°25′36″N 78°21′37″E / 17.4267669°N 78.3602534°E |
కాంపస్ | పట్టణ, 200 ఎకరాలు |
అనుబంధాలు | విశ్వవిద్యాలయ గ్రాంట్ కమీషన్ |
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు, ఇస్లాం-ఉర్దూ సాహిత్య పండితుడైన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పేరును విశ్వవిద్యాలయానికి పెట్టారు.[1] 2015లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నగరంలో రెండవ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసేవరకు ఇది భారతదేశంలోని ఏకైక ఉర్దూ విశ్వవిద్యాలయంగా ఉంది.[2]
హైదరాబాదులోని గచ్చిబౌలిలోని 200 ఎకరాల విస్తర్ణంలో విశ్వవిద్యాలయం ఉంది. అఖిల భారత అధికార పరిధితో పార్లమెంటు చట్టం ద్వారా 1998, జనవరిలో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఉర్దూ భాషను ప్రోత్సహించడం, సాంప్రదాయ, దూరవిద్య విధానం ద్వారా ఉర్దూ మాధ్యమంలో వృత్తి, సాంకేతిక విద్యను అందించడం ఈ విశ్వవిద్యాలయ ప్రధాన లక్ష్యం. ఈ ప్రాంగణం ప్రకృతి అందాలతో, అందమైన రాతి నిర్మాణాలతో కూడి ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాలనుండి విద్యార్థులు, సిబ్బంది ఈ విశ్వవిద్యాలయానికి వచ్చారు. నేషనల్ అసెస్మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఐఏసి) ఈ విశ్వవిద్యాలయానికి "ఎ" గ్రేడ్ను ప్రదానం చేసింది.[3]
ఈ విశ్వవిద్యాలయానికి లక్నోలో శాటిలైట్ క్యాంపస్, శ్రీనగర్ (జమ్మూ కాశ్మీర్) వద్ద క్యాంపస్ లు ఉన్నాయి. వీటితోపాటు భోపాల్, దర్భంగా, శ్రీనగర్, ఔరంగాబాదు, సంభల్, అసన్సోల్, నుహ్, బీదర్ మొదలైన ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్య కళాశాలలు ఉన్నాయి. వీటిని విద్య-శిక్షణ శాఖ ద్వారా మార్గనిర్దేశం చేస్తారు. విశ్వవిద్యాలయం బెంగుళూరు, దర్భాంగా, హైదరాబాదు, కటక్ ప్రాంతాలలో నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలను నిర్వహిస్తోంది. అలాగే బెంగుళూరు, దర్భాంగా, హైదరాబాదు, కటక్ లలో నాలుగు ఐటిసి కళాశాలలు; దర్భాంగా, హైదరాబాదు, నుహ్ (మీవాట్) లో మూడు ఉర్దూ మోడల్ పాఠశాలలు కూడా ఉన్నాయి.[4]
ఇందులో 7 విభాగాల ద్వారా విద్యను బోధిస్తారు. ఈ శాఖలు ప్రస్తుతం 84 కోర్సులు (25 పిహెచ్డి; 21 పిజి; 10 యుజి, 05 పిజి డిప్లొమా, 05 డిప్లొమా ప్రోగ్రామ్లు, 2 సర్టిఫికేట్ కోర్సులు) లను అందిస్తున్నాయి.[5]
1. భాషలు, భాషాశాస్త్రం, ఇండాలజీ
2. వాణిజ్యం, వ్యాపార నిర్వహణ
3. మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం
4. స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
5. ఆర్ట్స్, సోషల్ సైన్సెస్
6. విద్య, శిక్షణ
7. శాస్త్రాలు
2018, మే 17 న ఫిరోజ్ బఖ్త్ అహ్మద్ ఈ విశ్వవిద్యాలయం కులపతిగా నియమితులయ్యాడు.[6]
ఈ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీ మొట్టమొదటి మహ్మద్ కులీ కుతుబ్ షా స్మారక ఉపన్యాసం ఇచ్చాడు.[7]
1998లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం మౌలానా ఆజాద్ గ్రంథాలయంకి నిలయంగా నిలిచింది.[8] ఉర్దూలో 27 పత్రికలు, ఆంగ్లంలో 129, హిందీలో తొమ్మిది, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషలలో 13 వార్తాపత్రికలు కాకుండా 40 ముఖ్య పత్రికలకు ఈ గ్రంథాలయం చందాలు చెల్లించింది. ఉర్దూ భాషా, సాహిత్యం, సంస్కృతి కేంద్రం ఈ విశ్వవిద్యాలయంతో సంబంధం కలిగివుంది.[9]