రాధా విశ్వనాథన్ | |
---|---|
జననం | రాధా సదాశివం 1934 డిసెంబరు 11 గోబిచెట్టిపాలయం, బ్రిటిష్ ఇండియా |
మరణం | 2018 జనవరి 2 | (వయసు 83)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | కర్ణాటక సంగీత విద్వాంసులు |
క్రియాశీల సంవత్సరాలు | 1940 – 2018 |
రాధావిశ్వనాథన్ (1934 డిసెంబరు 11 – 2018 జనవరి 2) భారతీయ సంగీత విద్వాంసురాలు, శాస్త్రీయ నర్తకి. ఆమె ప్రముఖ సంగీత విద్వాంసురాలు, భారతరత్న పురస్కార గ్రహీత అయిన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి కుమార్తె. ఆమె తన తల్లితో పాటు కచేరీలను చేసింది.
ఆమె 1934, డిసెంబరు 11 న గోబెచెట్టిపలయం లో జన్మించింది.[1] ఆమె త్యాగరాజన్ సదాశివం, అతని మొదటి భార్య అపితకుచంబల్ (పార్వతి) కు జన్మించింది. కానీ ఆమె తల్లి మరణం తరువాత తండ్రి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ని వివాహమాడాడు. [2]
రాధ టి.ఆర్.బాలసుబ్రహ్మణ్యం, రామ్నాథ్ క్రిష్ణన్, మాయవరం క్రిష్ణ అయ్యర్ వద్ద సంగీతంలో ప్రాథమిక శిక్షణను పొందింది.(ఆమె కల్కి కృష్ణమూర్తి కుమార్తె ఆనంది రామచంద్రన్ తో కలసి విద్యనభ్యసించింది. వారు మొదటి శిష్యులు)[3] ఐదు సంవత్సరాల వయస్సులో ఆమె తన తల్లితో పాటు కచేరీలను ప్రారంభించింది. ఆమె వఝవూర్ రామయ్య పిళ్ళై వద్ద నృత్య శిక్షణను పొందింది. [4] భరతనాట్య నృత్యకారిణిగా మంచి గుర్తింపు పొందింది. ఆమె 1945లో నృత్యకారిణిగా అరంగేట్రం చేసింది. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పదాలను పాడినపుడు రాధ, ఆనంది నృత్యాన్ని ప్రదర్శించేవారు. [5] ఆమె మద్రాసులోని కర్ణాటక సంగీత కళాశాలలో నృత్య ప్రదర్శననిచ్చింది. ఆమె బిర్లా హౌస్ లో మహాత్మాగాంధీ ఎదుట "ఘనశ్యాం ఆయారి" అనే మీరా భజన్ ను ఎం.ఎస్.సుబ్బులక్ష్మీ పాడినపుడు నృత్య ప్రదర్శననిచ్చింది. 21 సంవత్సరాల వయస్సులో ఆమె గానంమీద దృష్టి పెట్టి నాట్యం చేసే ప్రదర్శననిచ్చింది. తరువాత సుబ్బులక్ష్మీ కచేరీలలో ముఖ్య పాత్ర పోషించింది. ఎం.ఎస్, రాధ కలసి ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ ల వద్ద శిష్యరికం పొంది కృతులను నేర్చుకున్నారు. వారు టి.బృంద వద్ద పదములను నేర్చుకున్నారు. వారు బెనారస్ లోని సిద్దేశ్వర దేవి, దిలీప్కుమార్ రాయ్ ల నుండి హిందూస్తానీ కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు.
ఆమె 6 సంవత్సరాల వయస్సులోఉన్నప్పుడు సినిమాలలో ప్రవేశించింది. ఆమె శకుంతల చిత్రంలోభరతునిగా, మీరా చిత్రంలో "బాల మీరా" గా నటించింది.[6] మీరా చిత్రాన్ని ఎల్లిస్ దుంగన్ దర్శకత్వం వహించగా ఆమె తండ్రి టి.సదాశివం కంపెనీ అయిన చంద్రప్రభ సినీటోన్స్ నిర్మించింది. మీరా చిత్రంలొ ఆమె కృష్ణుని పాత్రధారి అయిన కుమారి కమల తో కలసి నాట్యం చేసింది. ఈ చిత్రం తమిళం, హిందీలలో నిర్మించబడినది. 1947 లో తరువాతి వెర్షన్ ను అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ద్వారా ప్రారంభించబడినది. ఈ సినిమా ప్రీమియర్ షోకు లార్డ్, లేడీ మౌంట్ బాటన్, రాజేంద్రప్రసాద్, విజయలక్ష్మీ పండిట్, ఇందిరాగాంధీలు హాజరయ్యారు.
ఆమె తన తల్లితో ఎక్కువగా కచేరీ ప్రదర్శనలలో, రికార్డింగ్ కార్యక్రమాలలో పాల్గొన్నది. ఎం.ఎస్. కు ఈమె తప్ప శిష్యులు ఎవరూ లేరు. వారిద్దరూ భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా యు.ఎస్, ఐరోపా, జపాన్, సింగపూర్, మలేసియా, థాయ్లాండ్, ఫిలిప్పీన్స్ లలో కచేరీలలో పాల్గొన్నారు. 1966 లో వారు ఐరోపా లో పర్యటించారు తరువాత వారు అమెరికా తీర ప్రాంతాలలో ప్రదర్శనననిచ్చారు. అమెరికా, ఐరోపా లలో మొట్టమొదటి కర్ణాటక సంగీత కచేరీలు చేసినవారిగా గుర్తించబడ్డారు. ఆ పర్యటనలలో భాగంగా 1966 అక్టోబరు లో యునైటెడ్ నెషన్స్ లో కచేరీ చేసారు. [7] వారు కంచి పీఠాధిపతి పరమాచార్య నిర్వహించిన కార్యక్రమంలో "మైథీం భజత" పాటను రూపకల్పనచేసి పాడారు.
ఎం.ఎస్, రాధా విశ్వనాథన్ కలసి అనేక పాటలకు రికార్డింగ్ చేసారు. "వెంకటేశ్వర సుప్రభాతం", "విష్ణు సహస్రనామాలు" లను రామకృష్ణ మఠానికి చెందిన వేద పండితులు స్వామి రంగనాథానంద, తాతాచారియర్ ల ఎదుట ఆరు నెలల పాటు అభ్యసించారు. 1980 లో అన్నమాచార్య రికార్డింగులను విడుదల చేసారు. అవి ఐదు రికార్టింగ్ సిరీస్ లలో "బాలాజీ పంచరత్నమాల" గా లభ్యమవుతాయి. ఈ రికార్డింగులకు వచ్చిన రాయల్టీలను వివిధ సంస్థలకు విరాళంగా అందజేసారు.
1975లో ఎం.ఎస్ కు ఫిలిప్పీన్స్ లో రామన్ మెగసెసె పురస్కారం లభించింది. వారిద్దరూ కలసి మలకానన్ ప్యాలస్ వద్ద కచేరీ చేసారు. 1977లో యు.ఎస్.ఎ కు రెండవసారి పర్యటనకు వెళ్ళినపుడు కార్నేజీ హాల్ లో ప్రదర్శననిచ్చారు. మహాశివరాత్రి సందర్భంలో వారు కంచి పరమాచార్య పూజలు నిర్వహిస్తున్నప్పుడు తంబూరాను మాత్రమే ఉపయోగించి వారి ఎదుట ప్రదర్శననిచ్చారు.
1982లో యునైటెడ్ కింగ్డం లో భారత దేశం ఉత్సవం జరిగినపుడు ఎం.ఎస్. రాధ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో కచేరీ చేసారు. ఈ కార్యక్రమానికి రాణి ఎలిజిబెత్ II, ప్రిన్స్ ఛార్లెస్, బ్రిటన్ ప్రధానమంత్రి, మార్గరెట్ థాచర్, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, సోనియా గాంధీ, రవిశంకర్, వి.కె.నారాయణమీనన్ (సంగీత నాటక అకాడమీ చైర్మన్), జుబిన్ మెహతా లు హాజరయ్యారు.
1982 ఏప్రిల్ లో రాధ టి.బి వ్యాధి కి గురై మూడు నెలలపాటు కోమాలో ఉన్నారు. కానీ బ్రతికి బయటపడింది. నెమ్మదిగా కోలుకుంది. తరువాత సంవత్సరాలలో ఆమె పాల్గొనవలసిన కచేరీలను ఆమె తండ్రి రద్దు చేసాడు. క్రొత్త కార్యక్రమాలలో కూడా పాల్గొనుటకు అంగీకరించలేదు. ఆమె చివరిసారు 1983, మార్చి 12 న చివరిసారి చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో మీనాక్షీ దేవాలయం ప్రయోజనం కోసం ఎం.ఎస్ నిర్వహించిన కచేరీలో పాల్గొంది. తరువాత 10 సంవత్సరాలు కచేరీలకు ఆమె తల్లితో పాటు వెళ్ళింది కానీ సంఖ్య తగ్గుతూ వచ్చింది. 1992 లో మరలా ఆరోగ్యం క్షీనించినందున ఆమె పూర్తిగా కచేరీలను ఆపివేసింది.
15 సంవత్సరాల తరువాత 2007, సెప్టెంబరు లో ఎం.ఎస్. సుబ్బలక్ష్మీ 91వ జన్మదిన వేడుకలలో మొదటి సారి కచేరీ చేసింది. చక్రాల కుర్చీలో కూర్చుని ఆమె మనుమరాలు ఐశ్వర్య తో పాటు పాల్గొన్నది. నారద గానసభలో జరిగిన ఈ కచేరీ తరువాత ఈ జంట 20కు పైగా కచేరీలలో పాల్గొన్నారు. వాటిలో కొన్ని యు.ఎస్. లో కూడా జరిగాయి. ఆమెకు మార్చి 2008 లో లలితకళా అకాడమీ వారిచే "సంగీతరత్న" పురస్కారం లభించింది. ఏప్రిల్ 2010 లో ఆమె కర్ణాటక సంగీతానికి చేసిన సేవలకు గాను క్లెవెలాండ్ ఆరాధన కమిటీ వారిచే "కళా చంద్రిక" పురస్కారం అందుకుంది. [8] ఆమె శిష్యులు అనురాధ (కె.వి.నారాయణస్వామి కుమార్తె), సిక్కిల్ గురుచరణ్, మహేశ్ వినాయకరం (ఘటం విద్వాంసుడు విక్కు వినాయక్రం కుమారుడు), నవనీత కృష్ణన్, పి.టి.శేషాద్రి, బాలాజీ శంకర్, నేపధ్యగాయని హరిణి.[9]
ఆమె భర్త గురుస్వామి విశ్వనాథన్. వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె(సుబ్బులక్ష్మీ విశ్వనాథన్). పెద్ద కుమారుడు చంద్రశేఖర్ వేణువు విద్వాంసురాలైన సిక్కిల్ మాల (వేణువు విద్వాంసురాలు సిక్కిల్ నీల కుమార్తె) ను వివాహమాడాడు. రెండవ కుమారుడు శ్రీనివాసన్ విశ్వనాథన్, అతని భార్త గీతా లకు ఎస్.ఐశ్వర్య, ఎస్.సౌందర్య కుమార్తెలు కలరు. శ్రీనివాసన్ "సుస్వరలక్ష్మీ ఫౌండేషన్ ఫర్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్" సంస్థకు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నాడు.
ఆమె బెంగళూరు లో తన 83వ యేట 2018, జనవరి 2 న మరణించింది.[10]