వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం) | |
---|---|
![]() శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (వెనుక వైపునుండి) | |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయ ప్రదేశం | |
భౌగోళికాంశాలు : | 17°46′48″N 83°12′50″E / 17.77987°N 83.213925°E |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | విశాఖపట్నం |
ప్రదేశం: | సింహాచలం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శ్రీ నరసింహస్వామి |
ప్రధాన దేవత: | లక్ష్మీదేవి |
పుష్కరిణి: | వరాహ పుష్కరిణి |
కవులు: | గోగులపాటి కూర్మనాధ కవి |
ముఖ్య_ఉత్సవాలు: | చందనోత్సవం, గిరి ప్రదక్షిణ |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ. 1098) |
సృష్టికర్త: | ప్రహ్లాదుడు |
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది.ప్రస్తుత ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఒడిషాకు చెందిన తూర్పు గంగా రాజు లాంగుల నరసింగ దేవ I కళింగ వాస్తుశిల్పం ప్రకారం నిర్మించారు, 1268 ADలో అతని కుమారుడు భానుదేవ I చేత ప్రతిష్ఠించబడింది.
ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు (మే నెలలో) వస్తుంది.
సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి, కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదునిని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు 'విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించు' మని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.
స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహనరసింహ స్వామి విగ్రహన్ని ఆరాదించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహనరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహనరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. వరాహం నరుడు, సింహం రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం [[త్రిభంగ ముద్ర]]లో (ఆసనంలో) వరాహం తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ (వైశాఖ పూర్ణిమకు దగ్గరలో) నాటికి చందనం తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు. .
ఈదేవాలయం లాంగూల గజపతిచే నిర్మించబడిందని పలు శాసనాలు తెలుపుచున్నాయి.ఈ ఆలయం లోని శాసనకాలం సా.శ.1100 నుండి 7శతాబ్దాలవరకు వ్యాప్తం. తూర్పుగాంగులు, రెడ్డిరాజులు, నందపురాన్ని పాలించిన శిలావంశయుజులు, మత్స్య వంశీయులు, గజపతులు స్వామికి అనేకదానాలు గావించిరి.శక సం.1438, 1441 లలో కృష్ణ దేవరాయలు స్వామిని సేవించాడు. శక సం.1438లో కృష్ణదేవరాయలు చిన్నాదేవీ తిరుమలదేవీ సహితుడై ఇక్కడకేతించి స్వామిని అనేక అలంకార వస్తువులు కైంకర్యంలను అర్పించాడు.అనేక గ్రామాలను సా.శ.1441లో ధారపోసినాడు.
గజపతులు పతనమైన తరువాత కుతుబ్ షాహీ వంశం వారు ఈ ప్రదేశంపై దండెత్తి దేవాలయ సంపదను దోచుకొనినారు.సా.శ.1604లో పద్మనాయక కులుడను విప్పర్ణ గోత్రుడును అగు సర్వప్ప అశ్వరాయుడు స్వామికి నిత్యనైవేద్య రాగభోగాలను పునరుద్ధరించి అవి యవిచ్ఛిన్నంగా జరుగునిమిత్తం నరవ అను గ్రామాన్ని సమర్పించాడు.
మిధ్య యుగాన ఈక్షేత్రం విద్యా కేంద్రమని పెక్కు శాసనాలవలన తెలుస్తుంది.శక సం.1275లో గంగానరసింహ భోగకాలాన పురాణాలు పఠించు బ్రాహ్మణులకు జీతమిచ్చునిమిత్తం శృఈ భంఢారాన 52 మాడలను గంగాదేవి యొసగింనది.శా.సం.1305లో సింహాచల మందలి బ్రాహ్మణులకు వేదం చెప్పుటకు జంపూ మహాసేనాపతి యొడ్య పెద్దిభట్టును నియమించాడు. పురాణ కావ్య నాటక వ్యాకరణ కాండవ తైత్తిరీయశాఖలను బోధించు బ్రాహ్మణులకు అదేవిధంగా నారాయణా సేనాపతి నిబంధంల నిచ్చాడు.
కూచిమంచి తిమ్మకవి (1690-1757) కట్టమూరి కామేశ్వరకవి (1830-90) సింహాచల మాహాత్మ్య శ్రీ లక్ష్మీనృసింహ చరిత్ర అనుపేర పేర రచించిన ప్రబంధం సింహచల మహాత్మ్యం వర్ణించారు. కూచిమంచి తిమ్మకవి 5 అశ్వాసాల కావ్యంగా తెలుగులో రచియించి గౌరీవల్లభునికి అంకితమిచ్చాడు.
సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా, పడమర వైపు ముఖాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే, పడమర ముఖద్వారం విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి.
దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైంది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభాన్ని కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.
సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కల్యాణం తరువాత ఈ ఘట్టంలో స్నానం ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉంది.
సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రాముఖ్యత పొందింది.
వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది.
సంవత్సరంపొడుగునా సింహాచలేశునికి ఉత్సవాలు పండుగలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని:
రాపత్తులో స్వామి రోజుకో అలంకరణలో కనిపిస్తారు
1. స్వామి వారి నిత్యకల్యాణం: టిక్కెట్టు ధర రూ.1000, రోజూ జరిగే ఈ సేవలో స్వామివారి పట్టు శేష వస్త్రం, చీర, రవికె, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, ఆరుగురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. 2. స్వర్ణ పుష్పార్చన: టిక్కెట్టు ధర రూ.1116, ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుంచి గంటపాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవికె, 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు.
దేవాలయంలో దర్శనవేళలు-ఉదయం 7 నుండి మధ్యాహ్నం 11.30 వరకు, తిరిగి 12.30 నుండి 2.30వరకు, తిరిగి 3.30 నుండి 7వరకు, సాయంత్రం 8.30 నుండి రాత్రి 9 వరకూ దర్శనం లభిస్తుంది
వసతి కొరకు-ఎ.పి.టి.డి.సి., చందన టూరిస్టు రెస్ట్ హౌస్, దేవాలయ సత్రం, తిరుమల దేవస్థాన సత్రాలు ఉన్నాయి.
విశాఖపట్టణం వరకు బస్సు, రైలు, విమాన మార్గాలలో రావచ్చును. అక్కడ నుండి సింహాచలం కొండ క్రిందికి (అడవివరం) సుమారు 15 కి.మీ. లోపు దూరం ఉంటుంది. అక్కడికి సిటీబస్సు, ఆటో, టాక్సీలలో చేరవచ్చును. సింహాచలం కొండ క్రింది నుండి పైకి దేవాలయం వరకు మెట్లమీదుగా (సుమారు వెయ్యి మెట్లు) గాని, దేవస్థానంవారి ఘాట్ రోడ్డు మీదుగా దేవస్థానం బస్సులోగాని, టాక్సీలోగాని చేరవచ్చును.
సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌకా, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలం 11 కి.మీ, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి 11 కి.మీ, విశాఖపట్నం బస్ స్టేషన్ నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. సింహాచలానికి 5 కి.మీల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్ క్యాబ్లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలను నడుపుతోంది. సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు (రూ.10) టోల్ రుసుము చెల్లించి ఆ వాహనాల్లోనే చేరుకోవచ్చు. కొండ పైకి చేరుకునేందుకు దేవస్థానం వారు నాలుగు, ఆర్టీసీ వారు 20 బస్సులు నడుపుతున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఇక చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేశారు.
ఆండాళ్ సన్నిధి (గోదాదేవి), సింహవల్లీ తాయారు సన్నిధి, లక్ష్మి నారాయణ సన్నిధి, త్రిపురాంతక స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం, శ్రీసీతారామస్వామి ఆలయం, గంగాధర, అడివివరం గ్రామం నుంచి 3 కి.మీల దూరంలో భైరవస్వామి సన్నిధి, కొండ దిగువన వరాహ పుష్కరిణి, కొండ మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం, కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయస్థూపం, సింహాచలానికి 8 కి.మీ దూరంలో శ్రీమాధవ స్వామి, వేణుగోపాల స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు ఇక్కడికొచ్చే పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్న విశాఖపట్నం, భీమిలి బీచ్, తొట్లకొండ బౌద్ధారామం, తదితరాలు ఉన్నాయి. ఇవి కాక, ఆంధ్రా వూటీగా పేరున్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బొర్రా గుహలు, అరకులోయ (సుమారు 100 కి.మీ) వెళ్లడం సౌలభ్యంగా ఉండటం సింహాచలం వచ్చే పర్యాటకులకు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు
సింహాచలం దేవస్థానం భూముల క్రమబద్ధీకరణకు చెందిన 578 జీవో నిలిచిపోయినప్పటికి దానిపై అధికారులు జిల్లా కలెక్టరు ఆదేశాలమేరకు అయిదు గ్రామాల్లో ప్రజాభిప్రయ నసేకరణ్ ప్రారంభించారు 2010 జూలై 6 నుంచి గతంలో దేవస్థానం స్థలాల్లో గృహనిర్మాణాలు చేపట్టిన వారిలో చాలామంది ఈ జీ.ఓ. ప్రకారం ఎందుకు క్రమబద్ధీకరణ చేసుకోలేదో తెలుసుకోవడానికి ఈ సేకరణ చేస్తున్నారు.