శీర్కాళి గోవిందరాజన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | శీర్కాళి గోవిందరాజన్[1] |
జననం | శీర్కాళి, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా | 1933 జనవరి 19
మరణం | 1988 మార్చి 24 చెన్నై, తమిళనాడు, భారతదేశం | (వయసు 55)
సంగీత శైలి | సినిమా సంగీతం (నేపథ్య గానం), భారతీయ శాస్త్రీయ సంగీతము |
వృత్తి | నేపథ్య గాయకుడు, నటుడు |
వాయిద్యాలు | గాత్రం |
క్రియాశీల కాలం | 1952–1988 |
శీర్కాళి గోవిందరాజన్ (19 జనవరి 1933 – 24 మార్చి 1988) ఒక కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు, భారతీయ చలనచిత్ర నేపథ్య గాయకుడు. ఇతడు మద్రాసు ప్రెసిడెన్సీ(ప్రస్తుతం తమిళనాడు)లోని శీర్కాళి అనే చిన్న గ్రామంలో శివచిదంబరం, అవయాంబళ్ అమ్మాళ్ దంపతులకు జన్మించాడు. ఇతడు తన ఎనిమిదవ యేట త్రిపురసుందరి దేవస్థానంలో ఒక పర్వదినం సందర్భంగా ప్రదర్శన ఇచ్చి బాలమేధావిగా పేరుపొందాడు.[2]
ఇతడు మద్రాసులోని తమిళ్ ఇసై కళాశాలలో చదివి 1949లో ఇసైమణి పట్టాను పొందాడు. తరువాత "సంగీత విద్వాన్" పట్టాను సంపాదించాడు. అదే సమయంలో కేంద్ర కర్ణాటక సంగీత కళాశాలలో ప్రొఫెసర్ అయిన "తిరుప్పాంపురం స్వామినాథ పిళ్ళై" వద్ద గురుకుల పద్ధతిలో శిక్షణ తీసుకున్నాడు. అదే సమయంలో 1951-1952 ప్రాంతాలలో ఇతడు సంగీత విద్వత్సభ, రసిక రంజని సభ వంటి సంస్థలు నడిపిన అనేక పోటీలలో పాల్గొని బహుమతులు గెలుపొందాడు. వాటిలో కారైకుడి సాంబశివ అయ్యర్ చేతుల మీదుగా పొందిన మూడు బంగారు పతకాలు ఉన్నాయి.[2]
భారత ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మద్రాసు విశ్వవిద్యాలయం ఇతనికి 1983లో గౌరవ డాక్టరేట్తో గౌరవించింది. ఇతని కుమారుడు శీర్కాళి జి.శివచిదంబరం కూడా కర్ణాటక సంగీత విద్వాంసుడు.[3]
ఇతడు తమిళ, తెలుగు, కన్నడ, మళయాల భాషల సినిమాలలో నేపథ్య గాయకుడిగా పాటలు పాడాడు.[4] ఇతడు ఎం.జి.రామచంద్రన్, జెమినీ గణేశన్, ఎన్.టి.రామారావు, ముత్తురామన్ మొదలైన సినిమా నటులకు పాటలు పాడాడు.
ఎస్.వి.వెంకటరామన్, ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు, సాలూరు రాజేశ్వరరావు, సుసర్ల దక్షిణామూర్తి,వి.దక్షిణామూర్తి, జి.రామనాథన్, సి.ఎన్.పాండురంగం, మాస్టర్ వేణు, కె.వి.మహదేవన్, కున్నక్కూడి వైద్యనాథన్, జి.దేవరాజన్, భీమవరపు నరసింహారావు, ఎ.రామారావు, తాతినేని చలపతిరావు, టి.జి.లింగప్ప, పి.ఆదినారాయణరావు, టి.ఆర్.పాప, ఘంటసాల వెంకటేశ్వరరావు, వేదా, జి.కె.వెంకటేష్, ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి, వి.కుమార్, ఎ.ఎం.రాజా, సి.రామచంద్ర, ఇళయరాజా, శంకర్ గణేష్, బాబూరాజ్ వంటి సంగీత దర్శకులు స్వరపరచిన సినిమా పాటలను ఆలపించాడు.
ఇతడు ఎం.ఎస్.విశ్వనాథన్, టి.ఎం.సౌందరరాజన్, ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, ఎస్.సి.కృష్ణన్, తిరుచ్చి లోకనాథన్, ఎ.ఎల్.రాఘవన్, కె. జె. ఏసుదాసు, ఎస్.వి.పొన్నుస్వామి, ఎన్.ఎస్.కృష్ణన్, టి.ఆర్.మహాలింగం వంటి పురుష గాయకులతోను, ఎం.ఎల్.వసంతకుమారి, పి.లీల, కె.జమునారాణి, జిక్కి, పి.సుశీల, కె.రాణి, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎల్.ఆర్.అంజలి, శూలమంగళం సిస్టర్స్, ఆర్.బాలసరస్వతి దేవి, ఎన్.ఎల్.గానసరస్వతి, ఎ.పి.కోమల, ఎ.జి.రత్నమాల, టి.వి.రత్నం, బెంగళూరు రమణి అమ్మాళ్, వాణీ జయరామ్, ఎస్.జానకి, ఎం.ఆర్.విజయ, సరళ, రోహిణి. పి.భానుమతి, ఎస్.వరలక్ష్మి, మనోరమ వంటి గాయనీమణులతోను సినిమా పాటలు పాడాడు.
ఇతడు పొందిన అనేక సత్కారాలలో కొన్ని[5]:
• 1949 తమిళ ఇసై కళాశాల, మద్రాసు నుండి "ఇసై మణి"
• 1951 కేంద్ర కర్ణాటక సంగీత కళాశాల, మద్రాసు నుండి "సంగీత విద్వాన్"
• 1968 కున్రకుడి ఆధీనమ్ వారి నుండి "ఇసై అరసు"
• 1970 ఉత్తమ గాయకుడిగా తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డు.
• 1972 భారతి యూత్ అసోసియేషన్, మద్రాసు వారి నుండి "ఇసై కాదల్"
• 1975 కళైమామణి పురస్కారం
• 1977 పుదుక్కోటై శ్రీ భువనేశ్వరి అధిష్టానం, శాంతానంద స్వామి వారి నుండి "సంగీత భాస్కర"
• 1977 త్యాగరాజ సంగీత సభ వారిచే "ఇసై తిలకం"
• 1980 కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి అవార్డు
• 1982 తమిళ్ ఇసై సంఘం, మద్రాసు వారిచే "ఇసై పేరారిజ్ఞర్"
• 1983 భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం
• 1987లో స్విట్జర్లాండులో జరిగిన ప్రపంచ శాంతి మహాసభలకు సాంస్కృతిక రాయబారిI
ఇతడు కందన్ కరుణై, వా రాజా వా, తిరుమలై తేన్కుమారి, ఆగతియార్, దైవమ్, రాజరాజచోళన్, తిరువరుల్, దశావతారం, తాయి మూకాంబికై, మీనాక్షి తిరువిలయదల్ మొదలైన కొన్ని తమిళ సినిమాలలో నటించాడు.