సంధ్యా శాంతారామ్ | |
---|---|
జననం | విజయ దేశ్ముఖ్ |
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | వి. శాంతారాం |
సంధ్యా శాంతారామ్ (విజయ దేశ్ముఖ్)[1] మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. 1950-1960లలో వి. శాంతారాం దర్శకత్వం వహించిన పలు హిందీ, మరాఠీ సినిమాలలో నటించి ప్రసిద్ధి చెందింది. ఝనక్ ఝనక్ పాయల్ బాజే (1955), దో ఆంఖేన్ బరాహ్ హాత్ (1958), నవరంగ్ (1959), పింజర (1972), అమర్ భూపాలి (1951) సినిమాలలో నటించింది.
సంధ్య 1938లో మహారాష్ట్రలో జన్మించింది. సంధ్య అక్క వత్సల దేశముఖ్, వత్సల కుమార్తె రంజనా దేశ్ముఖ్ ఇద్దరూ కూడా సినిమా నటిమణులే.
అమర్ భూపాలి (1951) సినిమా కోసం కొత్త నటులను వెతుకుతున్నప్పుడు వి. శాంతారాం[2] సంధ్యను చూశాడు. 1952లో అమర్ భూపాలి సినిమాలో గాయని పాత్రలో తొలిసారిగా నటించింది. ఆ తరువాత శాంతారాం తీసిన చాలా సినిమాలలో నటించింది.
ఝనక్ ఝనక్ పాయల్ బాజే సినిమా కోసం శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందింది. ఈ సినిమా విజయవంతమై, నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులతోపాటు హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది.[3] దో ఆంఖేన్ బరాహ్ హాత్ సినిమాలో సంధ్య తన భర్త పక్కన నటించింది.[4] నవరంగ్ సినిమాలో నటించింది.
మహాభారతం నుండి శకుంతల కథను అనుసరించి తీసిన స్త్రీ (1961) సినిమాలో నటించింది.[5] పింజర సినిమాలో తమాషా నృత్య కళాకారిణిగా ప్రధాన పాత్రలో నటించింది.[6]
2009లో, నవరంగ్ 50వ వార్షికోత్సవం సందర్భంగా వి. శాంతారామ్ అవార్డుల వేడుకలో సంధ్య పాల్గొన్నది.[7]
శాంతారాం రెండవ భార్య నటి జయశ్రీని పోలి ఉన్న సంధ్య,[8] జయశ్రీ నుండి విడిపోయిన తరువాత 1956లో శాంతారాంను వివాహం చేసుకుంది.