ప్రొఫెసర్ సాహిబ్ సింగ్ (16 ఫిబ్రవరి 1892 – 29 అక్టోబరు 1977) సిక్కు పండితుడు, వ్యాకరణవేత్త, రచయిత, వేదాంత వేత్త. ఆయన హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి హిరానంద్. ఆయన అసలు పేరు నాథూ రామ్.[1]
చిన్నప్పుడు నాథూ రామ్ ను పంజాబీ ముస్లిం కవి హషిం కొడుకు హయత్ షా దగ్గర పర్షియన్ భాష నేర్చుకునేవారు.
ఆయన ప్రాథమిక స్థాయిలో చదువుకునేటప్పుడు సిక్కు సైనికులను చూసి వారిలా జుట్టు పెంచుకోవాలనుకునేవారు. 1906లో తొమ్మిదో తరగతి చదువుకునేటప్పుడు అమృతధరీ అయి, సిక్కుగా మారారు ఆయన. అప్పుడే తన పేరు సాహిబ్ సింగ్ గా మార్చుకోవాలనుకున్నారు. అప్పట్నుంచీ ఆయనకు పర్షియన్ భాష నేర్పించడం మానేసి, సంస్కృతం నేర్పించారు ఆయన తండ్రి. అలా నేర్చుకున్న సంస్కృతం గురు గ్రంథ్ సాహిబ్ అర్ధం చేసుకోవడానికి బాగా ఉపయోగపడింది.[2]
పదవ తరగతి అయిన తరువాత తపాలా శాఖలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు సాహిబ్. ఆ ఉద్యోగం వచ్చిన వెళ్ళి చేరడానికి దారి ఖర్చులకు డబ్బులు లేక, వారి ఇంటి పనిమనిషి వద్ద 20 రూపాయలు అప్పు తీసుకుని, వెళ్ళి ఉద్యోగంలో చేరారు.
తరువాత కొద్ది కాలానికే పై చదువులు చదవాలన్న కోరిక బలపడుతూ వచ్చింది. కానీ సరపడా డబ్బు లేక ఆగిపోయారు. కొన్నాళ్ళకు పండిత్ వెస్త ప్రసాద్ అనే ఉపాధ్యాయుణ్ణి కలుసుకున్నారు సాహిబ్ సింగ్.
ఆయన ఎఫ్.ఎ, ఎం.ఎ చదివారు. ఆ తరువాత ఫ్రక్కా కళాశాలలోనూ, గుజ్రన్ వాలా ఖల్సా కళాశాలలోనూ పనిచేశారు. ఈ కళాశాలలోనే బవ హరకృష్ణ్ సింగ్, భాయ్ జోధ్ సింగ్ లను కలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన ఆర్థిక స్థితి మెరుగుపడి, ఆంతకు ముందు అప్పులు తీర్చగలిగారు.[2]
తండ్రి చనిపోయిన తరువాత ఆయన ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఆ తరువాత లాహోర్ లోని ద్యాల్ సింగ్ కళాశాలలో డిగ్రీ చదివారు.[3] ఆ తరువాత 1917లో గుజ్రన్ వాలాలోని గురు నానక్ ఖల్సా కళాశాలలో సంస్కృత ఉపాధ్యాయునిగా చేరారు సాహిబ్ సింగ్.[3][4] 1921లో ఎస్.జి.పి.సికి అసిస్టెంట్ జనరల్ సెక్రట్రీ అయ్యారు సాహిబ్. 1922లో గురు కా బాగ్ మోర్చా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళారు. 1923లో జైతో మోర్చాలో పాల్గొన్నందుకు తిరిగి అరెస్టు అయ్యారు ఆయన. 1927లో తిరిగి గుజ్రన్ వాలా కళాశాలలో చేరి, 1936వరకు అదే ఉద్యోగంలో ఉన్నారు. ఆ తరువాత అమృత్ సర్ లోని ఖల్సా కళాశాలలో పంజాబీ ఉపాధ్యాయునిగా చేరారు. అక్కడ సిక్కు పండితులు ప్రొఫెసర్ తేజ సింగ్, ప్రొఫెసర్ గండ సింగ్, భాయ్ వీరం సింగ్, ప్రొఫెసర్ మోహన్ సింగ్ జీ లను కలుసుకున్నారు సాహిబ్. 1952లో ఉద్యోగ విరమణ చేసి, అమృత్ సర్ లోని షాహీద్ మిషనరీ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేశారు. 1962లో ఆయన కుమారుడు సిధ్వన్ బెట్ పటియాలా కు ట్రాన్స్ ఫర్ కావడంతో ఆ ఉద్యోగం వదిలి సాహిబ్ పటియాలా వచ్చేశారు. అక్కడ గురుమత్ కళాశాలలో క్లాసులు చెప్పారు కొన్నాళ్ళు. 1971లో పటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయం ఆయనకు సాహిత్యంలో డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.[5]
ఎక్కువ సేపు కష్టపడి పని చేయడంతో ఆయన అనారోగ్యానికి గురయ్యారు కానీ, ఆయనది సాధారణంగా మంచి ఆరోగ్యమే. నరాల బలహీనతతో నడవలేకపోవడమే ఆయనకు వచ్చిన రోగం. 29 అక్టోబరు 1977న మరణించారు.
సాహిబ్ సింగ్ ఎక్కువగా పంజాబీ భాషలో ఎన్నో పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలను ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనువాదం అయ్యాయి.[6]