అశోక్ సింఘాల్ | |
---|---|
జననం | ఆగ్రా, భారతదేశము | 1926 సెప్టెంబరు 15
మరణం | 2015 నవంబరు 17 గుర్గాంవ్, భారతదేశము | (వయసు 89)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | విశ్వహిందూ పరిషత్ నాయకులు |
బంధువులు | ముక్తార్ అబ్బాస్ నక్వి (son-in-law) |
అశోక్ సింఘాల్ (15 సెప్టెంబరు 1926 – 2015 నవంబరు 17) విశ్వహిందూ పరిషత (వీహెచ్పీ) మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు. ఈ బాధ్యతలను 20 సంవత్సరాలుగా చేసి అనారోగ్య కారణాలతో డిసెంబరు 2011 నుండి వైదొలగారు.[1] ఆయన స్థానంలో అప్పటి నుండి ప్రవీణ్ తొగాడియా ఆ బాధ్యతలను నిర్వర్తిసున్నారు. సింఘాల్ అనారోగ్యంగా ఉన్నప్పటికీ మరణించిన ఒక నెల ముందువరకు తన సేవలనందించారు.[2]
సింఘాల్ ఆగ్రాలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వోద్యోగి.[3] సింఘాల్ 1950 లో బనారస్ హిందూ యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెటలర్జికల్ ఇంజనీరింగులో పట్టభద్రులైనారు.[4] ఆయన 1942 నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) లో ఉన్నారు. ఆయన గ్రాడ్యుయేషన్ అయిన తదుపరి ఆర్.ఎస్.ఎస్.ప్రచారక్ గా పూర్తికాలం పనిచేసారు. ఆయన ఉత్తర ప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో పనిచేసారు. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా యూపీలో పెద్దఎత్తున ఉద్య మం మొదలుపెట్టి జైలుకెళ్లారు. న్యూఢిల్లీ, హర్యానాలో ప్రాంత ప్రచారక్ గా కూడా పనిచేసారు. 1980లో ఆయన వి.హెచ్.పికి జాయింట్ సెక్రటరీగా నియమింపబడ్డారు. 1984లో ఆయన ఆ సంస్థకు ప్రధాన కార్యదర్శిగాను, తరువాత అధ్యక్షునిగాను పనిచేసారు. ఈ పదవిలో 2011 వరకు కొనసాగారు.[5] అయన బ్రహ్మచారి.
ఆయన మంచి గాయకుడు కూడా. పండిత ఓంకార్నాథ్ ఠాకూర్ వద్ద హిందూస్థానీ గాత్ర సంగీతం నేర్చుకున్నారు. తమిళనాడులోని మీనాక్షీపురంలో 1981లో వందలాదిమంది దళితులు ఇస్లాం తీసుకున్న సంఘటనలు హిందూ సమాజంలో కలకలం రేపగా, ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు సింఘాల్ రంగంలోకి దిగారు. దళితుల కోసం సింఘాల్ నేతృత్వంలో వీహెచ్పీ ప్రత్యేకంగా 200 గుడులు నిర్మించి వారిచేత ఆలయ ప్రవేశాలు చేయించింది. దీని తర్వాత మతమార్పిడులు ఆగిపోయాయని ఆ సంస్థ పేర్కొంది. 1984లో ఢిల్లీలో సింఘాల్ ఆధ్వర్యంలో తొలి ‘ధర్మ సంసద్’ జరిగింది. అక్కడి నుంచి రామజన్మ భూమి ఉద్యమం వేడెక్కి అయోధ్యవైపు అడుగులు పడ్డాయి. సింఘాల్ నేతృ త్వంలోని కార్సేవకులు 1992 డిసెంబరు ఆరున అయోధ్య లోని బాబ్రీ మసీదును కూల్చివేశారు. రామాలయ ఉద్యమం తోపాటు గోరక్షణ ఆందోళనలో తమకు స్ఫూర్తినిచ్చిన సింఘాల్ను వీహెచ్పీ నేతలు మార్గ దర్శిగా, దార్శనికుడుగా భావిస్తారు. ఆయన హయాంలో 40 దేశాల్లో వీహెచ్పీ శాఖలు ప్రారంభమ య్యాయి. హైందవ ధర్మ పరిరక్షణ కోసం తన యావజ్జీవితాన్ని ధారబోసిన సింఘాల్.. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం తన చిరకాల స్వప్నమని గతంలో అనేకసార్లు ప్రకటించారు.[6]
శ్వాసకోశ సంబంధిత వ్యాధితోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం నవంబరు 17 2015 న ఆస్పత్రిలో మరణించారు.