కీ.శే. కోన ప్రభాకర రావు | |
---|---|
![]() | |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి | |
In office 24 February 1981 – 22 September 1981 | |
అంతకు ముందు వారు | దివికొండయ్య చౌదరి |
తరువాత వారు | అగరాల ఈశ్వరరెడ్డి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 10 July 1916 బాపట్ల, గుంటూరు జిల్లా |
మరణం | 10 October 1990 |
జాతీయత | భారత దేశం |
కోన ప్రభాకరరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ సభాపతి, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, 1940లలో తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత.
ప్రభాకరరావు 1916, జూలై 10న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించాడు. ప్రాథమికవిద్య బాపట్లలో పూర్తి చేసుకొని మద్రాసు లోని లయోలా కళాశాలనుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత పూణే లోని ఐ.ఎల్.ఎస్ న్యాయ కళాశాలనుండి న్యాయ శాస్త్రములో డిగ్రీ పూర్తిచేశాడు.
పాఠశాలలో ఉండగా మోతీలాల్ నెహ్రూ మరణించిన సందర్భముగా తరగతుల బహిష్కరణ నిర్వహించాడు. ఉప్పు సత్యాగ్రహము లోనూ చురుకుగా పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలములో ఒక యువబృందాన్ని నిర్వహించి ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేయటానికి కృషి చేశాడు.
ప్రభాకరరావు 1940 లో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రములోని బాపట్లలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. 1967లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు తొలిసారిగా ఎన్నికైనాడు. ఈయన బాపట్ల శాసనసభ నియోజకవర్గం నుండే వరుసగా మూడు పర్యాయములు (1967, 1972, 1978) శాసనసభకు ఎన్నికైనాడు. 1980-81 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభాపతిగా నియమితుడైనాడు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో ఆర్థిక, ప్రణాళికా శాఖమంత్రిగా కూడా పనిచేశాడు.
ప్రభాకరరావు 1983 సెప్టెంబరు 2 న అప్పట్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న పాండిచ్చేరి గవర్నరుగా నియమితుడయ్యాడు. ఆ పదవిలో 1984 జూన్ వరకు కొనసాగి, 1984 జూన్ 17న సిక్కిం గవర్నర్గా బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత 1985, మే 30 న మహారాష్ట్ర గవర్నరుగా నియమితుడైనాడు. 1986 ఏప్రియల్ లో బొంబాయి విశ్వవిద్యాలయం మార్కుల విషయంలో చెలరేగిన దుమారంలో ఈయన పాత్రపై సంశయం ఏర్పడడంతో మహారాష్ట్ర గవర్నరు పదవికి రాజీనామా చేశాడు.[1]
క్రీడలలో ఆసక్తి కలిగిన ప్రభాకర్ 1938లో బొంబాయి విశ్వవిద్యాలయంలో టెన్నిస్ ఛాంపియన్ అయ్యాడు. బాపట్ల, ఇతర ప్రదేశాలలో శివాజీ వ్యాయామ మండలి స్థాపనకు తోడ్పడ్డాడు. పూణేలో కళాశాల రోజుల్లో ప్రభాకర్ కుస్తీలు పట్టేవాడు., బాడ్మింటన్ ఛాంపియన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈయనకు అనేక సాంస్కృతిక సంస్థలతో అనుబంధం ఉంది. తొలినాళ్ళలో అనేక తెలుగు సినిమా లను నిర్మించి, దర్శకత్వం వహించాడు. కొన్నింటిలో స్వయంగా నటించాడు కూడా. ఈయన సినిమాలలో మంగళసూత్రం, నిర్దోషి, ద్రోహి, సౌదామిని.[2]
బాపట్ల శాసనసభ్యునిగా ఉన్నంత కాలం ప్రభాకరరావు బాపట్ల అభివృద్ధికి విశేషంగా కృషిచేశాడు. విద్యారంగంలో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి సొంత ఊరిలో అనేక విద్యాసంస్థలు అభివృద్ధి చెందేందుకు దోహదం చేశాడు. కృష్ణా జలాలను బాపట్లకు రప్పించడానికి కృషిచేసి వ్యవసాయరంగానికి దోహదపడ్డాడు.
ఈయన అక్టోబరు 20, 1990 న హైదరాబాదులో మరణించాడు.