రుద్రపట్నం బ్రదర్స్ | |
---|---|
![]() ఆర్.ఎన్.తారానాథన్ (ఎడమ), ఆర్.ఎన్.త్యాగరాజన్ (కుడి) | |
వ్యక్తిగత సమాచారం | |
మూలం | అరకలగూడు, హసన్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం, భారతదేశం |
సంగీత శైలి | కర్ణాటక శాస్త్రీయ సంగీతం |
క్రియాశీల కాలం | 1956 | – ప్రస్తుతం
సభ్యులు | ఆర్.ఎన్.త్యాగరాజన్ & ఆర్.ఎన్.తారానాథన్ |
రుద్రపట్నం బ్రదర్స్ పేరుతో పిలువబడే ఆర్.ఎన్.త్యాగరాజన్, ఆర్.ఎన్.తారానాథన్లు జంట కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసులు. ఈ జంట విద్వాంసులకు 2018లో భారత ప్రభుత్వం మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని ఇచ్చి గౌరవించింది.
రుద్రపట్నం ఎన్. త్యాగరాజన్ 1943, జూలై 15వ తేదీన[1], రుద్రపట్నం ఎన్.తారానాథన్ 1946, నవంబరు 11వ తేదీన[1] కర్ణాటక రాష్ట్రం, హసన్ జిల్లా, అరకలగూడ్ గ్రామంలో జన్మించారు. వీరి తాత ఆర్.కె.కృష్ణశాస్త్రి సంగీతకారుడు, హరికథకుడు, నాటక రచయిత, సంస్కృత, కన్నడ పండితుడు. వీరి తండ్రి ఆర్.కె.నారాయణస్వామి ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యుడు. ఇతని బాబాయిలు ఆర్.కె.వెంకటరామ శాస్త్రి, ఆర్.కె.రామనాథన్, ఆర్.కె.శ్రీకంఠన్ అందరూ సంగీత విద్వాంసులే.
వీరు తమ కర్ణాటక సంగీతాన్ని తమ తండ్రి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నారు.
త్యాగరాజన్ గణిత శాస్త్రంలో ఎం.ఎస్.సి చదివాడు. పలు సంవత్సరాలు గణితాధ్యాపకునిగా పనిచేశాడు. 1976లో ఆకాశవాణిలో ఉద్యోగంలో చేరాడు. ఇతడు చెన్నై దూరదర్శన్ కేంద్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. 2003లో బెంగళూరు దూరదర్శన్ కేంద్రానికి డిప్యుటీ డైరెక్టర్గా పనిచేస్తూ పదవీవిరమణ చేశాడు.
తారానాథన్ రసాయన శాస్త్రంలో ఎం.ఎస్.సి, పి.హెచ్.డి చేశాడు. ఇతడు కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసి మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సి.ఎఫ్.టి.ఆర్.ఐ) బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్ విభాగాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా పదవీ విరమణ చేశాడు. ఇతడు తన పరిశోధన ప్రాజెక్టుల నిమిత్తం అనేక పర్యాయాలు జర్మనీ సందర్శించాడు.
వీరు తమ పూర్వీకుల నుండి ప్రేరణ పొంది అనూచానంగా వస్తున్న కర్ణాటక సంగీతాన్ని స్వీకరించారు.[2] వీరి సంగీతంపై సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, జి.ఎన్.బాలసుబ్రమణియం, రామనాథ్ కృష్ణన్, తంజావూరు ఎస్.కల్యాణరామన్ వంటి సంగీతకారుల ప్రభావం ఉంది. వీరు త్యాగరాజస్వామి శిష్యపరంపరకు, వాలాజపెట వెంకటరమణ భాగవతార్ శిష్యపరంపరకు చెందినవారు. మైసూర్ సదాశివరావు శిష్యులు. నాయకి, వరాళి, బేగడ, ముఖారి, సహన, మధ్యమావతి, హనుమతోడి రాగాలలో వీరు తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.
ఈ సోదరులు 1956లో మొదటి కచేరీ చేశారు. తరువాత క్రమం తప్పకుండా దేశవిదేశాలలో ఆరు దశాబ్దాలకుపైగా అనేక ప్రదర్శనలు చేశారు.[3] వీరు లాల్గుడి జయరామన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, వి.వి.సుబ్రమణ్యం, ఎం.చంద్రశేఖరన్, రామనాథపురం సి.ఎస్.మురుగభూపతి, టి.కె.మూర్తి, పాల్గాట్ ఆర్.రఘు, ఉమయల్పురం కె.శివరామన్, వెల్లూర్ జి.రామభద్రన్, కారైకుడి మణి, వి.కమలాకరరావు, త్రిచ్చి శంకరన్, శ్రీముష్ణం వి.రాజారావు, కె.ఎస్.మంజునాథన్, వి.హరిశంకర్, టి.హెచ్.వినాయకరం వంటి వాద్య కళాకారుల సహకారంతో అమెరికా, బ్రిటన్, సింగపూర్, మలేషియా, అరబ్బు దేశాలతో పాటు భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో అనేక కచేరీలు నిర్వహించారు[3].
సంవత్సరం | పురస్కారం/బిరుదు | ప్రదానం చేసినవారు |
---|---|---|
1961, 1963, 1964 & 1965 | ఆల్ ఇండియా రేడియో శాస్త్రీయ, లలిత సంగీత పోటీలు | అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ సోదరులు విడివిడిగా శాస్త్రీయ సంగీత, లలిత సంగీత విభాగాలలో గెలుపొందారు. |
1979 | గాన సుధాకర | కర్ణాటక సంగీత నృత్య అకాడమీ, బెంగళూరు |
1992 | కర్ణాటక రాజ్యోత్సవ ప్రశస్థి | కర్ణాటక ప్రభుత్వం |
1995 | గానకళా తిలక | కర్ణాటిక్ మ్యూజిక్ సొసైటీ, గోవా |
2003 | సంగీత కళాతపస్వి | వాగ్గేయకార ఆరాధనోత్సవ సమితి, మైసూరు |
2003 | కర్ణాటక కళాశ్రీ | కర్ణాటక సంగీత నృత్య అకాడమీ, బెంగళూరు |
2005 | త్యాగరాజ ప్రశస్తి | బెంగళూరు నాగరత్నమ్మ ట్రస్ట్ |
2005 | సంగీత విద్యానిధి | జె.ఎస్.ఎస్.సంగీతసభ, మైసూరు |
2006 | ఆర్టిస్ట్స్ ఆఫ్ ది ఇయర్ | బెంగళూరు గాయన సమాజ |
2006 | గాయక కళాభూషణ | శ్రీ త్యాగరాజ గానసభ ట్రస్ట్, బెంగళూరు |
2007 | స్వరాలయ శృంగ | సుస్వరాలయ సంగీత కళాశాల, బెంగుళూరు |
2008 | స్వరమూర్తి వి.ఎన్.రావు మెమోరియల్ జాతీయ అవార్డు | వి.ఎన్.రావు మెమోరియల్ ట్రస్టు, బెంగళూరు |
2008 | ఆస్థాన విద్వాంసులు | కంచి కామకోటి పీఠం |
2011 | కళాజ్యోతి | నాదజ్యోతి శ్రీ త్యాగరాజ భజన సభ, బెంగళూరు |
2014 | గాన వారిధి | ఎం.ఎ.నరసింహాచార్ మ్యూజిక్ ఫౌండేషన్, బెంగళూరు |
2015 | సంగీత నాటక అకాడమీ అవార్డు | కేంద్ర సంగీత నాటక అకాడమీ, న్యూఢిల్లీ |
2016 | సంగీత కళాచార్య అవార్డు | మద్రాసు సంగీత అవార్డ్, చెన్నై |
2017 | సంగీత కళారత్న అవార్డు | బెంగళూరు గాయన సమాజ, బెంగళూరు |
2018 | పద్మశ్రీ పురస్కారం | భారత ప్రభుత్వం |