యండమూరి వీరేంద్రనాథ్ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14, 1948లో జన్మించాడు.[3] ఈయన తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి.
యండమూరి వీరేంద్రనాథ్ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14, 1948లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది. ప్రాథమిక విద్యకాకినాడ, రాజమండ్రి ల లోనూ, ఆరవ తరగతి జమ్మలమడుగు లోనూ, ఏడవ తరగతి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్హైదరాబాద్ లోనూ, బి.కాం కాకినాడ లోనూ చదివాడు. 1972లో సీ.ఏ. పట్టా పుచ్చుకున్నాడు.
వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన యండమూరి ఐదు సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో, పది సంవత్సరాల పాటు ఆంధ్రా బ్యాంకు చిన్న తరహా పరిశ్రమల విభాగానికి అధిపతిగా పనిచేశాడు. పూర్తిస్థాయి రచయితగా మారడం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
వివిధ నాటకాలు, నాటికలు, నవలలు, సినిమాల కోసం, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఉపన్యాసాలలో ఈయన వ్రాసిన ఈ పంక్తులు, చెప్పిన మాటలు ఈయన శైలి ఏమిటో చెబుతాయి.
ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే... ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు... చాలు!
ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే!
నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం.
మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి.
వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది?
దేవుడికి దీపం అవసరంలేదు, చీకట్లో మగ్గుతున్న మీ అంతరాత్మలో దీపం వెలిగించి భగవంతుడి ముందు ఆత్మ విమర్శ చేసుకోండి. అప్పటికీ మీలో కళంకం లేదనిపిస్తే అప్పుడు మీరు నిజమైన దైవభక్తులు.
దేశ సరిహద్దులు మనిషి నిర్మించుకున్నవి. ఒక గీతకి కేవలం అటూ ఇటూ ఉండటం వల్ల ఇద్దరు వ్యక్తులు శత్రువులవటం దురదృష్టకరం.
కన్నీరా! క్రిందకు జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!!
జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు- మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవడానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దాని వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది.
ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తి శిఖరాలను ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతో సహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.
↑ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.