?హన్మకొండ జిల్లా తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°57′N 79°30′E / 17.95°N 79.5°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 12,846 కి.మీ² (4,960 చ.మై) |
ముఖ్య పట్టణం | హన్మకొండ |
ప్రాంతం | తెలంగాణ |
జనాభా • జనసాంద్రత • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
35,22,644 (2011 నాటికి) • 274/కి.మీ² (710/చ.మై) • 1766257 • 1756387 • 58.41(2001) • 70.01 • 46.54 |
హన్మకొండ జిల్లా, భారతదేశం, తెలంగాణ రాష్ట్రం లోని జిల్లా.[1] ఈ జిల్లా పరిపాలన కేంద్రం హన్మకొండ పట్టణం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో లోగడ ఉన్న వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, వరంగల్ గ్రామీణ జిల్లాగా విభజించారు.ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మారుస్తూ 2021 ఆగస్టు 12 న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2][3][4][5]
2011 భారతీయ జనాభా గణాంకాలను అనుసరించి వరంగల్ జిల్లా జనాభా 759,594. వీరిలో పురుషుల శాతం 51%. స్త్రీల శాతం 49%.
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం వరంగల్ జిల్లా అక్షరాస్యత 84.16%. ఇది జాతీయ అక్షరాస్యత 69.5% కంటే అధికం. వీరిలో పురుషుల అక్షరాస్యత 91.54%. స్త్రీల అక్షరాస్యత 76.79%. వరంగల్ జిల్లాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు 11% మంది ఉన్నారు.
1981 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ జిల్లా జనాభా: 22,99,61, స్త్రీ, పురుషుల నిష్పత్తి 987:1000, అక్షరాస్యత 23.84 శాతం (మూలం:ఆంధ్రప్రదేశ్ దర్శిని.1985)
సా.శ.12-14 శతాబ్దాలలో పరిపాలించిన కాకతీయుల రాజ్యానికి మొదటి రాజధాని హనుమకొండ. కాకతీయుల నిర్మించిన ఎన్నో కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి.కాకతీయుల పాలనా దక్షత గురించి ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తన రచనలలో రాసాడు. కాకతీయ పాలకులు - కాకర్త్య గుండన, మొదటి ప్రోలరాజు (1050-1080), రెండవ బేత రాజు (1080 - 1115), రెండవ ప్రోల రాజు (1115-1158), రుద్ర దేవుడు (1158-1195), మహా దేవుడు (1195-1199), గణపతిదేవ చక్రవర్తి (1199-1261), రుద్రమ దేవి (1258-1290), ప్రతాపరుద్రుడు ( 1290-1326).
14 వ శతాబ్దంలో ఢిల్లీ తుగ్లక్ సుల్తానుల చేతిలో ఓడిపోవడంతో కాకతీయుల పరిపాలన అంతమైంది. తరువాత అది ముసునూరి నాయకులు, రేచెర్ల నాయకులు, బహమనీ సుల్తానులు, గోల్కొండను పాలించిన దక్కను సుల్తానుల పాలన లోకి వచ్చింది. మొగలు చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను 1687లో ఆక్రమించినపుడు అది మొగలు సామ్రాజ్యంలో భాగమయింది. తరువాత 1724లో ఈ సామ్రాజ్యం లోని దక్షిణ ప్రాంతం విడివడి హైదరాబాదు రాజ్యం ఏర్పడినపుడు వరంగల్లు ఆ రాజ్యంలో భాగమైంది. 1948లో వరంగల్లుతో సహా హైదరాబాదు భారతదేశంలో కలిసి పోయింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిది.1996 వ సం.లో వరంగల్ పట్టణ అభివృద్ధికి కేంద్ర పభుత్వం నిధులను మంజూరు చేసింది.
1969లో తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం జరుగుతున్నట్లు మిగిలిన ఆంధ్రరాష్ట్ర ప్రజలపట్ల చూపుతున్న శ్రద్ధ తమ పట్ల చూపకుండా పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నట్లు తలచారు. ఫలితంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తలెత్తింది. ఈ ఉద్యమం కారణంగా వరంగల్ జిల్లాలో విషాదపరిస్థితిని ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితిలో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణా ప్రజా సమితి (టి పి ఎస్) పార్టీ స్థాపించబడింది. 1956లో నిర్ణయించిన విధంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలని ఇతరనాయకులు కూడా తమ కోరికను వెలిబుచ్చారు. వరంగల్ జిల్లా ప్రజలు ఈ ఉద్యమానికి పక్కబలంగా నిలిచారు. విద్యార్థులు, ప్రభుత్వోద్యోగులు, వ్యవసాయదారులు అందరూ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 400 కంటే అధికమైన విద్యార్థులు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం కోల్పోయారు.
పూర్వపు వరంగల్ జిల్లా 2001 భారత జనాభా లెక్కలు ప్రకారం 12,846 చ.కి.మీ.లలో వ్యాపించి 32,31,174 జనాభా కలిగి ఉంది. బొగ్గు, గ్రానైటు గనులకు (నలుపు, బ్రౌను రకాలు) జిల్లా ప్రాముఖ్యత చెందింది. వరి, మిరప, పత్తి, పొగాకు పంటలు విరివిగా పండుతాయి.గాలిలోని తేమశాతం సగం మాత్రమే ఉండే తెలంగాణా భూభాగంలో ఉన్న కారణంగా వరంగల్ వాతావరణం వేడివాతావరణం కలిగి ఉంటుంది. మార్చి మాసంలో ఆరంభం అయ్యే వేసవి కాలం మే మాసానికి 42 ° (108 ° ఫారెన్ హీట్ ) సెంటీగ్రేడుల శిఖరాగ్రం చేరుకుంటుంది. జూన్ మాసానికంతా ఆరంభం అయ్యే వర్షాలు సెప్టెంబరు వరకు కురుస్తుంటాయి. వర్షపాతం 22 మిల్లీమీటర్ల (22 అంగుళాలు) వరకు కురుస్తుంది. నవంబరు మాసం నుండి మంచుకురవని తేమలేని స్వల్పమైన శీతాకాలం ఆరంభం అయి ఫిబ్రవరి మాసం ఆరంభం వరకు ఉంటుంది. శీతాకాలం సరాసరి ఉష్ణోగ్రత 22-23 ° సెంటీగ్రేడులు (72-73 ఫారెన్ హీట్ ) వరకు ఉంటుంది. వరంగల్ జిల్లా సందర్శనానికి ఇది తగిన సమయం. వరంగల్ జిల్లా సముద్రమట్టానికి 302 మీటర్ల (990 అడుగులు) ఎత్తులో ఉంటుంది. భారతదేశంలోని భూపర్యవేష్టిత జిల్లాలలో ఇది ఒకటి. అలాగే అటవీ ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలలో కూడా ఇది ఒకటి.
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత, 2016 లో ప్రభుత్వం మొదటిసారిగా నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణ చేపట్టింది. పూర్వపు వరంగల్ జిల్లాలో ఉన్న --- మండలాల నుండి వరంగల్, హన్మకొండ, ధర్మసాగర్, హసన్పర్తి 4 మండలాలు, కరీంనగర్ జిల్లా నుండి ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ 3 మండలాలు, పాతమండలాల వరంగల్, హన్మకొండ, ధర్మసాగర్, హసన్పర్తి మండలాల నుండి వరుసగా ఖిలా వరంగల్, కాజీపేట, వేలేర్, ఐనవోలు అనే 4 మండలాలు విభజించి మొత్తం 11 మండలాలతో ఈ జిల్లా వరంగల్ పట్టణ జిల్లాగా ది.11.10.2016న ఏర్పడింది.[1][6] వరంగల్ పట్టణ జిల్లాలో గతంలో ఉన్న 11 మండలాలలో వరంగల్ రెవెన్యూ డివిజను పరిధిలోని తొమ్మిది మండలాలు, పూర్వపు వరంగల్ గ్రామీణ జిల్లా ప్రస్తుత వరంగల్ జిల్లా, పరకాల రెవెన్యూ డివిజను లోని 5 మండలాలు కలిపి మొత్తం 14 మండలాలతో తిరిగి హన్మకొండ జిల్లాగా మారుస్తూ 2021 ఆగస్టు 12 న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.[7][8][9]
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (4)
గమనిక: హన్మకొండ జిల్లాగా మార్చకుముందు (పూర్వపు వరంగల్ పట్టణ జిల్లా) లో ఉన్న వరంగల్ మండలం, ఖిలా వరంగల్ మండలం ప్రస్తుత వరంగల్ జిల్లా (పూర్వపు వరంగల్ గ్రామీణ జిల్లా) లో చేర్చారు.[3]
గమనిక:పూర్వపు వరంగల్ గ్రామీణ జిల్లా (ప్రస్తుత వరంగల్ జిల్లా) లో ఉన్న పరకాల, దామెర, ఆత్మకూరు, శాయంపేట, పాత మండలాలు, 2018 ఆగస్టులో కొత్తగా ఏర్పడిన నడికూడ మండలం ఈ జిల్లాలో కొత్తగా ఏర్పడిన పరకాల రెవెన్యూ డివిజనులో చేర్చారు.[2]
వరంగల్ నగర శివార్లలో ఈశాన్యంలో ఉన్న మమ్నూరు గ్రామం వద్ద వరంగల్ - ఖమ్మం రహదారిలో వాయుసేన గ్లైడర్ శిక్షణా కేంద్రంగా ఉపయోగపడుతుంది. నిజాం నవాబు కాగజ్ నగర్ పేపర్ మిల్లు, అజం జాహీ మిల్లుకు చేరడానికి అనుగుణంగా నిర్మించబడిన ఈ విమానాశ్రయం 1947 వరకు దేశంలోనే పెద్ద విమానాశ్రయంగా ఉంటూ వచ్చింది. సమీపంలో ఉన్న విమానాశ్రయం వరంగల్ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలో హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.
వరంగల్ రైలు మార్గం ద్వారా భారతదేశంలోని అనేక ప్రముఖ నగరాలతో అనుసంధానించబడింది. ఇది భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే విభాగానికి చెందింది.వరంగల్కు 13 కి.మీ.సమీప దూరంలో ఉన్న ఖాజీపేట రైల్వే జంక్షన్, హైదరాబాదు, న్యూ ఢిల్లీ, విజయవాడ, చెన్నై, కొలకత్తా రైలు మార్గంలో ప్రముఖ రైలు కూడలి. వరంగల్ రైలు స్టేషను హైదరాబాద్, విజయవాడ, చెన్నై రైలు మార్గంలో ఉంది. ప్రతి రోజు ఈ స్టేషను ద్వారా గూడ్స్ రైళ్ళు కాక 132 రైళ్ళు దాటి వెళుతుంటాయి. దేశంలో రైలు స్టేషనులలో పెద్ద రైలు స్టేషనులలో వరంగల్ రైలు స్టేషను ఒకటి.
హైదరాబాదు నుండి భోపాలపట్నం వరకు వేస్తున్న జాతీయరహదారి - 202 నిర్మాణదశలో ఉంది. ఈ రహదారిలో వరంగల్ నుండి పోతుంది. వరంగల్, హన్మకొండ వద్ద రెండు ప్రధాన బస్సు స్టాండ్లు ఉన్నాయి. వరంగల్ నుండి దూరప్రాంతాలకు వెళ్ళే డీలక్స్ బస్సులు బెంగుళూరు, మద్రాసు, హైదరాబాదు, తిరుపతి, అనంతపూరు, హుబ్లి, బెల్గాం లకు ఉన్నాయి. అలాగే స్టాండెడ్ ఎక్స్ప్రెస్ బస్సులు గుంటూరు వయా విజయవాడ, చెన్నై, చెరియాల్ మార్గంలో వరంగల్ ను చేరుకుంటాయి.
వరంగల్ ఆర్థికంగా వ్యవసాయం మీద ఆధాపడి ఉంది. వరంగల్ సమీపంలో దేశాయిపేట వద్ద ఉన్న ఎనుమాముల గ్రామం వరంగల్ జిల్లా ధాన్యపు వాణిజ్య కేంద్రంగా ఉంది. ఇక్కడ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉంది. ఈ ప్రాంతం బియ్యపు వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ప్రాంతీయ అవసరాలకు, వెలుపలి వాణిజ్యానికి అవసరమైన బియ్యం వ్యాపారం ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. 1990 వరకు ఈ ప్రాంతంలో పత్తి ఉత్పత్తి ప్రధానంగా జరిగింది. ఇటీవలి కాలంలో పత్తి ఉత్పత్తిలో సమస్యలు ఎదురైయ్యాయి. ఈ జిల్లాలో 1997-1998 మధ్య పత్తిరైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదు అయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ జిల్లాలో పరిశ్రమలకు ముఖ్యత్వం ఇవ్వడంలో శ్రద్ధవహించ లేదు. నిజాం కాలం నుండి సాగుతున్న కొన్ని పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. అజం జాహి క్లోత్ మిల్లు మూతపడింది. జిల్లాలో చిన్నతరహా పరిశ్రమలు మాత్రం నడుస్తున్నాయి. రెండవ స్థాయి నగరాలు సాంకేతిక రంగంలో జరుగుతున్న విప్లవాత్మక ఫలాలని అందునే ప్రయత్నంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్ టి పి ఐ) వరంగల్ జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించాలని అనుకుంటున్నారు. చక్కని ప్రయాణ వసతులు, నాణ్యమైన విద్యాసంస్థల నుండి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు, మంచి భవనవసతులు, తక్కువగా ఉన్న వాహనాల రద్దీ, హైదరాబాదుకు అందుబాటు దూరంలో ఉన్న కారణంగా వరంగల్ ఇందుకు తగి ఉంది. విదేశాలలో స్థిరపడిన ప్రవాసభారతీయుల నుండి ఈ జిల్లాకు విదేశీ పెట్టుబడులు అందుతున్నాయి.
వరంగల్ జిల్లాలో ప్రజలు అధికంగా తెలుగు భాషను మాట్లాడుతుంటారు. వరంగల్ ప్రజలు సంప్రదాయమైన చీరె, ధోవతి వంటి దుస్తులతో అధునిక వస్త్రాలను కూడా ధరిస్తుంటారు.వరంగల్ జిల్లా నుండి అత్యధికంగా యువత విదేశాలలో పనిచేస్తున్నారు. ప్రధానంగా అమెరికా వంటి దేశాలలో అధికంగా పనిచేస్తున్నారు. అత్యధికంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారే. అనేకంగా ప్రతి ఇంట్లో విదేశాలలో నివసిస్తున్న సభ్యులు ఉన్నారు. యువతలో అధికులు సాంకేతిక రంగంలో నైపుణ్యం ఉన్న కారణంగా ఐ.టి. సంస్థలు ఇక్కడ తమ శాఖలను స్థాపించడానికి ఉత్సుకత చూపుతున్నారు. వరంగల్ జిల్లాలోని ప్రజల అభిరుచులను తెలంగాణ సమాజం లోని ప్రజలు ఒక రకంగా ప్రామాణికంగా పరిగణిస్తారు. చుట్టూ పక్కల గ్రామీణ ప్రాంతాల నుండి వలస వచ్చి స్థిర పడిన వారి సంఖ్యనే అధికం.
వరంగల్ జిల్లాలో దేశంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయి. వరంగలు తెలంగాణ జిల్లాలలో 2 వస్థానంగా ఉంది. 1959లో పండిత జవహర్లాల్ నెహ్రుచే పునాది రాయి స్థాపించబడిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (పాత పేరు ఆర్.ఇ.సి వరంగల్), కాకతీయ మెడికల్ కాలేజీ ఉంది. ఎన్ ఐ టి భారతదేశం అంతా చక్కగా అభివృద్ధి చెందింది. వరంగల్ నిట్ (ఎన్ ఐ టి) దేశంలో అత్యుత్తమమైందిగా భావిస్తారు. 1959 లో దీనిని స్థాపించినప్పటి నుండి ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు అనేకులు దేశ విదేశాలలో ఉన్నారు. ఈ సంస్థ దేశం మొత్తం నుండి ప్రతిభావంతులని అనేక మందిని ఆకర్షిస్తుంది.
◆ వేయి స్థంభాల గుడి: 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి, వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హన్మకొండ నగరం నడిబొడ్డున ఉంది.
◆ కాకతీయ జంతు ప్రదర్శనశాల లేదా వన విజ్ఞాన కేంద్రం తెలంగాణ అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో సామాన్య ప్రజానీకానికి వన్య సంరక్షణ గురించి తెలుపడానికి ఏర్పాటు చేయబడింది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని ప్రతి రోజు 500 మంది సందర్శకులు వరకు సందర్శిస్తుంటారు. 50 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విజ్ఞాన కేంద్రం, వరంగల్ హంటర్ రోడ్ వద్ద ఉంది.
◆ ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం:సమీపంలోని ఐనవోలులో ఈ దేవాలయం ఉంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యు (సా.శ.1076-1127) ని మంత్రిగా పనిచేసిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడు.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)